calender_icon.png 21 October, 2024 | 7:40 AM

బీఆర్‌ఎస్ దోపిడీని లెక్కలతో చూపిస్తా

21-10-2024 12:24:20 AM

  1. ఎల్‌బీ స్టేడియంలో చర్చకు సిద్ధం
  2. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లకు మంత్రి జూపల్లి సవాల్

కామారెడ్డి, అక్టోబర్ 20 (విజయక్రాంతి): గడిచిన పది సంవత్సరాల్లో బీఆర్‌ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని, దోచుకున్న సొమ్మును లెక్కలతో సహా చూపిస్తానని, ఇందుకు లాల్‌బహుదర్ స్టేడియంలో వేదికను సిద్ధం చేసి ప్రతి విషయంపై చర్చిండానికి సిద్ధంగా ఉన్నానని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు.

ఇందుకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రలు హరీశ్‌రావు, కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుంటూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తాము ఇచ్చిన హమీలను ఒకొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. మూసీ, హైడ్రా, రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై ప్రజలను బీఆర్‌ఎస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా నేతలు మనాల మోహన్‌రెడ్డి, తహెర్‌బీన్ హుందాన్ పాల్గొన్నారు.