calender_icon.png 24 October, 2024 | 5:05 AM

మన ‘గాంధీ’ని గౌరవిద్దాం!

24-10-2024 01:05:40 AM

బుద్దా ప్రవీణ్    

చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, నిజాయితీ, నిరాడంబరత, నిస్వార్థ సేవ, ఉద్యమ భావాలు కలిగిన మహనీయుడు మనం ‘తెలంగాణ గాంధీ’గా పిలుచుకొనే భూపతి కృష్ణమూర్తి. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని క్రీయాశీలకంగా పనిచేశారు. స్వాతంత్య్రం అనంతరం జరిగిన తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లోనూ పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కనులారా చూసిన పోరాటయో ధుడు. తన ఆస్తులను ఉద్యమాలకే ధారపోసిన త్యాగజీవి. ఆయన జీవితమంతా పోరాటమే. బతుకంతా ఉద్యమాలే. నిస్వార్థంగా పోరాడటమే తప్ప పేరు ప్రఖ్యా           తులు, పదవులు ఆశించని మహామనీషి. 

మహాత్ముని బాటలో..

ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆయనకు తెలంగాణ సమాజం 2009లో ‘తెలంగాణ గాంధీ’ అని బిరుదునిచ్చి సత్కరించింది. ప్రజాబంధు, స్వతంత్ర సమర కేసరి వంటి అవార్డులను అందుకున్నారు భూపతి. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తూ, ఆ మార్గంలోనే నడిచిన భూపతి కృష్ణమూర్తి తాను కోరుకున్నట్టే ప్రత్యేక తెలం గాణ రాష్ట్రంలోనే 2015 ఫిబ్రవరి 15న వరంగల్లో తుదిశ్వాస విడిచారు. ఇంతటి గొప్ప ఘన చరిత్ర కలిగిన మహనీయుని పేరును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. కొత్త యూనివర్సిటీ లలో ఒక దానికి వారి పేరు పెట్టాలి. అలాగే, భూపతి కృష్ణమూర్తి జయంతి , వర్ధంతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. 

బాపూజీతో పది రోజులు

కరీంనగర్ జిల్లా ముల్కనూర్‌కు చెంది న భూపతి కృష్ణమూర్తి 1926 ఫిబ్రవరి 21న వరంగల్లులోని తన అమ్మమ్మ గారిం ట్లో జన్మించారు. 1941 నుంచి 1946 వరకు వరంగల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పనిచేశారు భూపతి. కాంగ్రె స్ సిద్ధాంతాలను పల్లెపల్లెన ప్రచారం చేయడంలో కీలకపాత్ర పోషించారు. వ్యాపారం చేస్తున్న తరుణంలోనే యువకులలో క్రీడాస్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో 1943లో నేషనల్ క్లబ్‌ను స్థాపించి ఆటలను ప్రోత్సహించారు. హాకీ, వాలీబాల్, కబడ్డీ, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో ప్రావీణ్యం కలిగినవారు భూపతి. అంతేకాదు, అర్జున అవార్డు గ్రహీత జె.పిచ్చయ్యతో కలిసి బాల్ బ్యాడ్మింటన్ ఆడేవారు. 1944లో మహాత్మాగాంధీ జన్మ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 2న వార్దాకు వెళ్లి గాంధీతోపాటు పది రోజులు అక్కడే గడిపే అరుదైన అవకాశం పొందారాయన. 

అవిశ్రాంత పోరాటం

1952లో భూపతి కృష్ణమూర్తి ప్రారంభించిన ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని వయోభారం సమస్య ఉన్నప్పటికీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కొనసాగించారు. 1946 ఆగస్టు 11న హయగ్రీవాచారితో కలిసి ఓరుగల్లు కోటమీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అదే సమయంలో రజాకార్ల దాష్టీకాన్ని కూడా ఆయన చవి చూశారు. 1946లో ఖాదీ బోర్డు ప్రచార కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1947 మధ్య కాలంలో జరిగిన హైదరాబాద్ విమోచన పోరాటంలో చురుకుగా పాల్గొని అజ్ఞాత జీవితం గడిపారు. అలాగే, 1948లో జరిగిన గ్రంథాలయోద్యమంలోనూ పాల్గొ న్నారు. ‘ఇడ్లీ  సాంబార్’ వ్యతిరేక ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేశారు. 1953- సంవత్సరంలో ‘ఫజల్ అలీ కమిషన్’ వరంగల్ వచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ను బలంగా వినిపించారు. తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో వేరే ప్రాంతంతో కలపొద్దని అవి శ్రాంతంగా తన గళం వినిపించారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ

1967లో వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు భూపతి కృష్ణమూర్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదేమోనని నమ్మకం సన్నగిల్లుతున్న సమ యంలో యువకులు, మేధావి వర్గాలతో కలిసి ‘తెలంగాణ ప్రజా సమితి’ ఏర్పాటు చేశారు. అలా, మరోసారి తెలంగాణ వాదులలో ఆశను రేకెత్తించారు. 1972లో ‘తెలంగాణ ప్రజా సమితి’, 1978లో ‘జనతా పార్టీ’, 1983లో బీజేపీ తరఫున, 1985లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా వరంగల్ శాసనసభ (ప్రస్తుత వరంగల్ తూర్పు) స్థానానికి పోటి చేసి ఓడిపోయారాయన. 1972లో పీవీ నర్సింహారావు, 1983లో ఎన్టీ రామారావు పిలిచి ఓరుగల్లు అసెంబ్లీ టికెట్ ఇస్తానన్నా కూడా వారు తిరస్కరించారు. దీన్నిబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష ఆయనలో ఎంత బలంగా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 1970 దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ సర్కిల్ సలహామండలి సభ్యునిగా పనిచేశారు. 1982 జనవరి 19న కార్మిక సంఘాల జాతీయ సమన్వయ సంఘం పిలుపు మేరకు నిర్వహించిన భారత్‌బంద్ సందర్భంగా జాతీ య భద్రతా చట్టం కింద అరెస్టయి వారం రోజులపాటు జైలు జీవితం గడిపారు.

ఓరుగల్లులో నెహ్రూ మెమోరియల్ హైస్కూల్, సి.కె.ఎం. కాలేజీ ఏర్పాటుకూ కృషి చేశారు భూపతి కృష్ణమూర్తి. అలాగే, విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల పాలకవర్గ సభ్యుడిగా, ఉపాధ్యక్షుడిగా, 1982 నుంచి1985 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యుడిగా పనిచేశారు. సి.కె.ఎం. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సలహామండలి సభ్యుడిగా ప్రభుత్వంతో నామినేట్ అయ్యారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక పరిపుష్ఠి కలగాలనే ఆలోచనతో ముల్కనూరు కో-ఆపరేటివ్ సొసైటీని స్థాపించారు. దీనికి భూపతి కృష్ణమూర్తి వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సొసైటీ ఆసియా ఖండంలోనే      ఆదర్శంగా నిలిచింది.