calender_icon.png 27 September, 2024 | 4:48 AM

కమిషన్‌నే తప్పుదారి పట్టించేలా!

26-09-2024 02:06:00 AM

  1. బ్యాంకు గ్యారెంటీపై తప్పుడు సమాచారం
  2. తాము తప్పించుకునేలా ఉన్నతాధికారుల సృష్టి
  3. రూ.159.72 కోట్లు రిలీజ్ చేయాలని ఎస్‌ఈ ఆదేశం
  4. విడుదలకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం
  5. కిందిస్థాయి ఉద్యోగులను బలిచేస్తున్న ఉన్నతాధికారులు 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాల నుంచి ఏ విధంగా బయటపడదామా అని చూస్తున్న ఉన్నతాధికారు లు.. కిందిస్థాయి అధికారులను బాధ్యులుగా చేసేలా తప్పుడు సమాచారాన్ని కమిషన్‌కు ఇస్తున్నారు.

కాళేశ్వరంపై ఏర్పాటుచేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్‌ను తప్పుదారి పట్టించేలా వ్యవహరించడం, తప్పుడు సమాచారం ఇస్తుండటంతో సొంత శాఖలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

బ్యాంకు గ్యారెంటీలపై దుష్ప్రచారం

ఈ దఫా విచారణలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. మేడిగడ్డ బ్యారేజీ కాంట్రాక్టర్ అయిన ఎల్‌అండ్‌టీ బ్యాంకు గ్యారెంటీలను రిలీజ్ చేయడంపై ఉన్నతాధికారులు, ఇంజనీర్లను ప్రశ్నించింది. ఉన్నతాధికారులకు తెలియకుండానే ఎల్ అండ్‌టీకి రూ.159.72 కోట్ల బ్యాంకు గ్యారెంటీని ఈఈగా పనిచేస్తున్న తిరుపతిరావు ఇచ్చినట్టు డిప్యూటీ సీఈ మహ్మద్ అజ్మల్‌ఖాన్ కమిషన్ ముందు వెల్లడించారు. రికార్డులన్నీ సక్రమంగా ఉన్నా కిందిస్థాయి అధికారులపై ఉన్నతాధికారులు నెట్టివేయడం గమనార్హం. 

కరోనా ప్రభావంతో 

2020లో వచ్చిన కొవిడ్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. పరిశీలించిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయాశాఖల పరిధిలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు సంబంధించి పలు నిబంధనలను సడలించాయి. పనులను పరిశీలించి బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయాలనే నిర్ణయించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిర్ణయం రాకముందే..

అంటే 2020 నవంబర్ 13న స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే బ్యాంకు గ్యారెంటీలను రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. పనులు పూర్తయ్యాయా లేదా పరిశీలించి, పనులు పూర్తయితేనే బ్యాంకు గ్యారెంటీని రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. కానీ, స్టాండింగ్ కమిటీ ఏదీ పరిశీలించకుండానే ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

బ్యాంకు గ్యారెంటీ రిలీజ్ 

అగ్రిమెంట్ అథారిటీ అయిన ఎస్‌ఈ ఆదేశాలతోనే కస్టోడియన్ అయిన ఈఈ తిరుపతిరావు రూ.159.72 కోట్ల బ్యాంకు గ్యారెంటీలను 23.1.2021న రిలీజ్ చేశారు. బ్యాంకు గ్యారెంటీలను తాము తీసుకున్నట్టు సంబంధిత కాంట్రాక్టు ప్రతినిధి రసీదు ఇచ్చారు. అంటే ఎస్‌ఈ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తరువాతనే ఈఈ బ్యాంకు గ్యారెంటీలను రిలీజ్ చేశారనేది స్పష్టమవుతోంది. ఎస్‌ఈ 2020 జనవరి 21న ఆదేశాలు జారీచేయగా.. ఈఈ 23న రిలీజ్ చేశారనేది తేటతెల్లం అవుతోంది.

ఎస్‌ఈ నుంచి ఆదేశాలు 

స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. దాని ప్రకారం ఈఎన్‌సీ మెమో (మెమో నెం. ఈఎన్‌సీ/కేపీ/కేఎన్‌ఆర్/డీసీఈ/డీఈఈ2/ఏఈఈ4/2020/ఎస్ తేది 25.11.2020) జారీ చేశారు. అలాగే ఆర్థిక శాఖ నుంచి కూ డా మెమో (మెమో నెం. 896215 తేది 29.12.20 20) ఇచ్చింది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా మెమో (మెమో నెం. 3648/రిఫార్మ్స్/2020 తేది 4.1.2021) జారీ చేసింది.

దీనితోపాటు కాంట్రాక్టు ఏజన్సీ కూడా లేఖ (లేఖ నెం. ఎల్‌టీపీఈఎస్/మేడిగడ్డ/ఐక్యాడ్/734 తేది 20.1.20 21) రాసింది. ఇలా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అప్పటి కాళేశ్వరం ప్రాజెక్టు సూపరింటెండెంట్ (రామగుం డం) ఇంజినీరు నుంచి తేది 21.1.2021 నాడు మెమో (మెమో నెం. ఎస్‌ఈ/కేపీసీ1/ఆర్‌జీఎం/2021/79/5) జారీచేశా రు.

బ్యారేజీ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని, రెండు సీజన్ల నుంచి బ్యారేజీని నీటిపారుదల శాఖ ఉపయోగిస్తుందని, ఈ నేపథ్యంలో కరీనంగర్‌లో ని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వెంటనే బ్యాం కు గ్యారెంటీని రిలీజ్ చేయాలంటూ కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్ నెం.1 మహదేవ్ పూర్ ఈఈని ఆదేశించారు.

బాధ్యులెవరు?

నిజాలన్నీ ఇలా ఉండగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను తప్పుదారి పట్టించే విధంగా డిప్యూటీ సీఈ సమాచారం ఇవ్వడం గమనార్హం. పనులను పరిశీలించకుండానే బ్యాంకు గ్యారెంటీలను రిలీజ్ చేయవచ్చని సిఫారసు చేసిన స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ మొదలుకుని.. బాఈఈకి ఆదేశాలిచ్చిన ఎస్‌ఈ వరకు అంద రూ బాధ్యత వహించాల్సి ఉండగా..

ఈఈ ని మాత్రమే బాధ్యుడిగా చేసేలా ఉన్నతాధికారులు వ్యవహరించడం ఆ శాఖలో చర్చకు దారితీసింది. ఇందులో స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సభ్యులతోపాటు ఈఎన్‌సీ మొదలుకుని సూపరిం టెండెంట్ ఇంజినీరు వరకు ప్రతి ఒక్కరినీ బాధ్యులుగా చేయాల్సి ఉంటుంది. జ్యుడీషియల్ కమిషన్‌కే తప్పుడు సమాచారం ఇస్తున్న ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నీటి పారుదల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.  

ఈఈ కస్టోడియన్ మాత్రమే 

వాస్తవానికి ఏదైనా పనిని చేపట్టినప్పుడు అగ్రిమెంట్ అథారిటీగా సూపరిం టెండెంట్ ఇంజినీరు (ఎస్‌ఈ) ఉంటారు. ఈ అగ్రిమెంట్ అథారిటీ (ఎస్‌ఈ) బ్యాం కు గ్యారెంటీలను తీసుకుని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)కి అప్పజెప్పి, వాటిని భద్రపర్చమని చెప్తారు. అంటే ఈఈ ఇక్కడ కస్టోడియన్ (వాచ్‌మెన్‌లా అన్నమాట)గా ఉంటారు.

ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా ఈఈ బ్యాంకు గ్యారెంటీలను రిలీజ్ చేసే అధికారం లేదు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మంగళవారం డిప్యూటీ సీఈ మహ్మద్ అజ్మల్ ఖాన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీనితో కమిషన్ కూడా ఈఈ తప్పుచేసినట్టు భావించేలా సమాచారాన్ని అందించారు.