calender_icon.png 24 October, 2024 | 11:50 PM

క్రీడాభివృద్ధికి ప్రణాళికతో ముందుకెళ్తాం

23-07-2024 01:18:07 AM

డీవైఎస్‌ఓల సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ‘దీర్ఘకాలిక వ్యూహం లక్ష్యం’ విధానంతో ముందుకెళ్తామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి తెలిపారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, జిల్లా క్రీడా, యువజన అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల మాదిరిగానే క్రీడా రంగాన్ని కూడా భ్రష్టు పట్టిచ్చిందని, కేసీఆర్ ప్రభుత్వం అవలంభించిన విధానాలతో క్రీడా రంగం కోమాలోకి వెళ్లిందని విమర్శించారు. గత పాలకులు ప్రవేశ పెట్టిన నూతన క్రీడా విధానం మాటలకే పరిమితమైందని, ఎలాం టి క్రీడాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

క్రీడా రంగం అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన చర్యలు చేపడతామ న్నారు. క్రీడల అభివృద్ధి కోసం సీఎస్‌ఆర్ నిధులతో ప్రణాళిక బద్ధమైన కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించే శిక్షణ కార్యక్రమాల్లో అలసత్వం తగదన్నారు. స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తున్న వివిధ క్రీడా అకాడమీల పనితీరు మెరుగుపర్చడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో సిబ్బంది, కోచ్‌ల కొరతతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కే సోనీ బాలాదేవి, డిప్యూటీ డైరెక్టర్లు అనురాధ, సూర్యలత, చంద్రారెడ్డి స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు, డివైఎస్‌ఓలు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.