ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ
గజ్వేల్ (విజయక్రాంతి): నిరుద్యోగులకు భవిష్యత్ పై ఆశలు చూపుతున్న రాజకీయ నిరుద్యోగులకు శాసనమండలి పునరావాస కేంద్రంగా మారిందని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. గజ్వేల్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న కారణంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలకు పైగా యువతకు విద్యాబోధన చేశానని, ప్రస్తుతం సమాజంలో చాలామంది నిరుద్యోగులుగానే మిగిలిపోయారన్నారు. నిరుద్యోగులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నారే కానీ వారి సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం కృషి చేయడం లేదని ఆరోపించారు. రాజకీయ నిరుద్యోగులంతా శాసనమండలిని పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారని, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. లెక్చరర్ గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన తనకు నిరుద్యోగుల సమస్యల గురించి, విద్యావ్యవస్థలో లోటుపాట్ల గురించి తెలుసని, తను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.