22-04-2025 12:14:42 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21(విజయక్రాంతి) : లేఔట్లు, నివాస ప్రాంతా ల్లో రోడ్లకు ఆటంకాలు కలిగించొద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఒకవేళ ఎక్కడైనా రోడ్లపై అడ్డంకులుంటే వెంటనే వాటిని తొలగించాలని లేదంటే తామే తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. రోడ్లపై పలువురు గోడలు కట్టి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని సోమవారం హైడ్రా ప్రజావాణికి పలువురు ఫిర్యాదు చేశారు.
వాటిపై వెంటనే దర్యాప్తు చేసి రహదారులు, ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను తొలగించాలని ఈ సందర్భంగా అధికారులను కమిషనర్ ఆదేశించారు. చుట్టూ ఇళ్లున్నా, మధ్యలో తమకు ఉన్న స్థలంలో ఎఫ్టీఎల్ పేరిట ఇల్లు కట్టుకోనివ్వడంలేదని పలువురు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేఔట్లు, ప్రభుత్వభూము లు, ప్రజావసరాలకు ఉద్దేశించినభూములను బైనంబర్లు వేసి కాజేస్తున్న వారి పట్ల కఠినంగా ఉండాలని సూచించారు. త్వరలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తవుతుందని కమిషనర్ తెలిపారు.
హైడ్రాకు వచ్చిన పలు ఫిర్యాదులు..
మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేటలోని సర్వే నంబర్ 345లో ఓ మాజీ ప్రజాప్రతినిధి 25గుంటల ప్రభుత్వ స్థలంలో అతిథిగృహాన్ని నిర్మించుకున్నారని, సర్వే నంబర్ 14లో 36గుంటల భూమిని ఆక్రమించుకున్నారని స్థానిక యువకులు ఫిర్యాదు చేశారు. ఫిరోజ్గూడ మాధవినగర్లోని పార్కు స్థలాన్ని కబ్జా చేశారని, దీనిపై తమకు కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ప్రయోజనం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.
శామీర్పేట దేవరయాంజల్లో వినియోగించే రోడ్డుకు పలువురు ఆటంకాలు సృష్టిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. గండిపేట మండలం రాజేంద్రనగర్ శ్రీవేంకటేశ్వర కాలనీకి 60ఫీట్ల రోడ్డు ఉన్నప్పటికీ దానికి అడ్డంగా ప్రహరీ నిర్మించారని ఫిర్యా దు చేశారు.
అక్కడే ఉన్న సర్వే నంబర్ 20లోని 23ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. సరూర్నగర్ చెరువుకు సమీపంలో తమకు ఇంటి స్థలం ఉందని, తమ స్థలం చుట్టూ ఇండ్లు న్నా ఇంటినిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని కోటేశ్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.