24-04-2025 06:45:57 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిపి ప్రాణాలను బలిగొన్న ఘటనను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లాయర్లు బుధవారం విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బార్ కౌన్సిల్ అసోసియేషన్ హాలులో కార్యదర్శి జంగం సిద్ధార్థ అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయవాదులుగా మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ చందర్ మాట్లాడుతూ... భారతదేశ జాతి సమైక్యత సౌబ్రాతత్వమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, ఉగ్రవాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతదేశాన్ని ఏమి చేయలేరన్నారు. 2019 పుల్వామా దాడి తర్వాత అత్యంత కిరాతకమైన ఘటనగా పేర్కొన్నారు. ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయన్నారు. భారతీయులంతా సంఘటిత శక్తిగా ముందుకు సాగుతూ ఇలాంటి దుశ్చర్యలు మళ్లీ జరగకుండా నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎన్వి చలపతిరావు, తుంపిల్లా శ్రీనివాస్, ఎస్ డి రహీం పటేల్, మామిడాల సత్యనారాయణ, కొండపల్లి కేశవరావు, జే. వెంకటేశ్వర్లు, చిలక మారి వెంకటేశ్వర్లు, రవికుమార్, గంధసిరి ఉప్పలయ్య, షేక్ పాషా, దర్శనం రామకృష్ణ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.