25-02-2025 11:35:00 AM
గోదావరిఖని, (విజయక్రాంతి): గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తరచుగా న్యాయవాదుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గోదావరిఖని కోర్టు న్యాయవాదులు ముకుమ్మడిగా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. రెండు రోజుల కిందట న్యాయవాది కిరణ్ కేసు విషయమై 1- టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే సీఐ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సిబ్బంది ముందు అవమానపరిచి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు.
అంతేగాక గతంలో కూడా న్యాయవాదుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ కావాలనే అవమాన పరుస్తున్నాడని పేర్కొన్నారు. న్యాయవాదులకు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా వ్యవహరిస్తున్న సీఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గోదావరిఖని భార్ అసోసియేషన్ అధ్యక్షులు టి సతీష్, ప్రధాన కార్యదర్శి జవాజి శ్రీనివాస్ తో పాటు న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదులనే అవమాన పరుస్తుంటే ఇక న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో అడ్వకేట్లు పాల్గొన్నారు.