* తనను డ్రగ్స్ కేసులో ఇరికించే యత్నం చేశాడని ఆరోపణ
* అందుకు సంబంధించి ఆధారాలు సమర్పణ
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 4 : హీరో రాజ్తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య తాజాగా ఆర్జే శేఖర్ బాషాపై నార్సింగి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో తనను ఇరికించే యత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆమె అడ్వకేట్ మీడియాతో మాట్లాడారు. మరో మహిళతో కలిసి లావణ్య బ్యాగులో డ్రగ్స్ పెట్టించేందుకు యత్నించాడని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను పోలీసులకు అందజేసినట్లు వివరించారు.
మస్తాన్సాయి కొత్త కోణాలు..!
మస్తాన్ సాయి విషయంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిని సోమవారం కోకాపేటలో అరెస్టు చేశారు. తనతోపాటు వందలాది మంది యువతుల సంబంధించిన ప్రైవేట్ వీడియో మస్తాన్ సాయి వద్ద ఉన్నాయని ఆరోపిస్తూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించి హార్డ్డిస్క్ కూడా అందజేసిన విషయం విధితమే.
పలువురు యువతులతో మస్తాన్ సాయి సన్నిహితంగా గడిపిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధిత మహిళలు అతడిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినట్లు తెలుస్తున్నది. వారికి వీడియో కాల్ చేసి మెడకు ఉరి బిగించుకున్నట్లు బ్లాక్ మెయిల్ చేసేవాడని గుర్తించారు. మస్తాన్ బాధితులు ఎవరైనా సరే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని నార్సింగి పోలీసులు పేర్కొన్నారు. రిమాండులో ఉన్న మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకోనున్నారు.