ముంబై: అమీర్ ఖాన్ నిర్మించిన లాపతా లేడీస్ చిత్రం అరుదైన గౌరవాన్ని సాధించింది. ఈ మూవీ 2025 ఆస్కార్ కు ఇండియా కేటగిరీ నుంచి ఎంపికైంది. ఈ విషయాన్ని తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఓ ఇంటర్వ్యూలో దర్శకురాలు కిరణ్ రావు మాట్లాడుతూ.. తమ చిత్రం ఆస్కార్ కు ఎంపికవుతుందని జోస్యం చెప్పారు. ఆమె చెప్పినట్లుగానే ఆస్కార్ 2025 కు ఎంపిక కావడం విశేషం.
స్టోరీ ఏంటి..?
2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ‘లాపతా లేడీస్’ తెరకెక్కింది. కొత్తగా పెళ్లి అయిన ఓ జంట వివాహం తర్వాత ఇంటికి వస్తుండగా మధ్యలో ఈ సంఘటన జరుగుతుంది. కానీ, ఈ విషయం తెలియని వరుడు తన భార్య అనుకుని వేరే వ్యక్తి భార్యను ఇంటికి తీసుకువచ్చేస్తాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత వధువును చూసి తన భార్య కాదని షాక్ అవుతాడు. దీంతో తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే తన భార్య ఎలా మిస్ అయింది? తన భార్య స్థానంలో వచ్చిన యువతి ఎవరు? ఆ తర్వాత చోటుచేసుకున్న సంఘటనలు ఏంటి? అనే కథాంశంతో మూవీని కిరణ్ రావు చాలా బాగా తీశారు.