calender_icon.png 15 April, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుకు భూభద్రత

14-04-2025 01:40:07 AM

నేడు భూభారతి చట్టం, పోర్టల్‌ను ప్రజలకు 

అంకితం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

  1. తొలుత 3 పైలట్ మండలాల ఎంపిక
  2. జూన్ 2నాటికి రాష్ర్టవ్యాప్తంగా అమల్లోకి..
  3. ధరణి పేరిట కొల్లగొట్టిన భూములపై ఫోరెన్సిక్ ఆడిట్
  4. రేపటినుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్లు
  5. రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా పోర్టల్ అభివృద్ధి
  6. వచ్చేనెల మొదటివారం నుంచి జీపీవోల సేవలు
  7. మీడియా చిట్‌చాట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి):- భూభారతి చట్టం సోమవారం నుంచి అమలులోకి రానుందని, ఇక మీదట ధరణి ఉండదని, సామాన్యుడికి సులువుగా అర్థమయ్యేలా భూభారతి చట్టం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి వెల్లడించారు.

రాష్ర్టంలో అంద రి భూములకు భద్రత, భరోసా కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టాన్ని, భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు భూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు.

ఆదివారం ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వ హించారు. రాష్ర్టంలో రైతుల భూముల పరిరక్షణ బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని, భూముల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అధికారంలో వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని తామిచ్చిన హామీని విశ్వసించి ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ధరణిని బంగాళాఖాతంలో వేసి అందరికీ ఆమోదయోగ్యమైన భూభారతి చట్టాన్ని తీసు కురావడం ఇందులో రెవెన్యూశాఖ మంత్రిగా తనకు భాగస్వామయ్యే అవకాశం వచ్చినందుకు తన జన్మధన్యమైందన్నారు. 

3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు..

రాష్ర్టంలో తొలుత మూడు జిల్లాలలోని మూడు మండలాల్లో ప్రయోగాత్మ కంగా భూభారతి చట్టాన్ని  అమలు చేయబోతున్నామని, ఈ మూడు మండలాల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి అవసరమైతే జిల్లాల్లో ట్రిబ్యునల్స్ వేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

భూభారతి చట్టం 2028 శాసనసభ ఎన్నికలకు తమకు రెఫరెండమని గతంలో  శాసనసభలోనే ప్రకటించడం జరిగిందని, ఇప్పుడు కూడా మరోమారు స్పష్టం చేస్తున్నానని తెలిపారు. భూములపై రాష్ర్టప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఒక భరోసా, భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించామన్నారు.

గతంలో మాదిరిగా రాత్రికి రాత్రే ఇద్దరు వ్యక్తులు కలిసి చట్టాన్ని రూపొందిస్తే, తమ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రైతులు, మేధావులు నిపుణులతో చర్చించి చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. గతంలో చెప్పినట్లుగానే భూభారతి అమలులోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూఅక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని తెలిపారు.

ఒకేసారి పోర్టల్‌లో ప్రవేశించవద్దు

ఒకేసారి భూయజమానులు తమ భూమి వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్‌ను సందర్శించవద్దని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల మొత్తం పోర్టల్ ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. అంతేగాక కొంతమంది ఉద్దేశపూర్వకంగా పోర్టల్‌ను స్ట్రక్ చేయాలని భావిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకునేలా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారని మంత్రి తెలిపారు.

కేంద్రప్రభుత్వ ఎన్‌ఐసీ ఆధ్యర్యంలో నిర్వహించే పోర్టల్‌లో ఆధునిక అంశాలను జోడిస్తూ అత్యాధునిక  వెర్షన్‌ను ప్రజలకు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయని, రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా పోర్టల్ అభివృద్ధి సాగుతుందని, రేపటి నుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయన్నారు.

వచ్చేనెల మొదటివారంలో గ్రామ రెవెన్యూ పాలనా అధికారులను అమలులోకి తెస్తామని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఈనెల17 నుంచి వీఆర్‌ఏ, వీఆర్వో నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. గతంలో ధరణిని తీసుకువచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా క్రమక్రమంగా పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 

చట్టంపై ప్రజలకు అవగాహన సదస్సులు

రాష్ర్టవ్యాప్తంగా భూభారతి చట్టం, పోర్టల్ అమలుకు సంబంధించి ఎంపిక చేసిన ప్రయోగాత్మక గ్రామాలలో స్వయంగా తాను పర్యటిస్తానని మంత్రి పొంగులేటి వెల్లడించారు. సంబంధిత జిల్లామంత్రులు కూడా పర్యటిస్తారని తెలిపారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు నిర్ణయించామని, భూభారతిలో తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎల్ వరకు సుమారు ఐదు స్థాయిలలో భూసమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాలు వికేంద్రీకరణ చేశామని స్పష్టం చేశారు.

అంతేగాక ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని, తర్వాత కాలంలో సమస్యలు తగ్గితే ఆ ట్రిబ్యునల్స్‌ను కుదిస్తామని, ధరణిలో గతంలో ఉండే 33 మాడ్యూల్స్‌ను ఆరు మాడ్యూల్స్‌కు తగ్గించామని దీనివల్ల అందరికీ పోర్టల్ సులభతరంగా ఉంటుందని తెలిపారు. దాదాపు 6వేల వరకు లైసెన్స్‌డ్ ల్యాండ్ సర్వేయర్లను తీసుకొస్తామని, వారి ద్వారానే భూముల సర్వేను చేపడతామని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి చట్టంలో సాదాబైనామా భూముల సమస్యల పరిష్కారం లేదని, ధరణి పార్ట్‌బీలో 18 లక్షల ఎకరాల భూమి ఉందని, అందులో ఉన్న సమస్యలను పైలట్ ప్రాజెక్ట్ కింద పరిష్కరిస్తారన్నారు. భూభారతితో ప్రజల భూములను తీసుకుంటున్నామనేది అవాస్తవమని, నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. 

వందేండ్లదాక భూభారతి

  1. ఎప్పటికప్పుడు పోర్టల్‌ను అప్‌డేట్ చేయాలి
  2. రైతులకూ అర్థమయ్యేలా వెబ్‌సైట్
  3. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి
  4. భూభారతిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): భూభారతి వెబ్‌సైట్ కనీసం వందేళ్లపాటు ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం భూభారతి పోర్టల్‌ను ఆవి ష్కరించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భం గా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సామాన్య రైతుకు కూడా అర్థమైయేలా భూభారతి వెబ్‌సైట్‌ను రూ పొందించాలన్నారు. అత్యాధునికంగా భూ భారతి వెబ్‌సైట్ ఉండాలని సూ చించారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పక డ్బందీగా ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసుకోవాలని, భూభారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సం స్థకు అప్పగిస్తే బాగుంటుందని ఆదేశించారు.

ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, నల్గొం డ ఎంపీ రఘువీర్‌రెడ్డి, భూపరిపాలన ప్రధా న కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవె న్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్, సీసీఎల్‌ఏ కార్యదర్శి మకరంద్ పాల్గొన్నారు.