25-04-2025 08:27:13 AM
సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి
నారాయణఖేడ్/నాగల్ గిద్ద,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని, ఇకనుంచి రైతులకు భూములకు సంబంధించిన ఇబ్బందులు ఉండవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం మనూరు,నాగల్ గిద్ద మండలలో భూభారతి చట్టం పై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన భూభారతి చట్టం 2025 ద్వారా రైతులకు ఉచిత న్యాయ సేవలు, అందుబాటులో ఉన్నాయని, తమ సమస్యను దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని, వివిధ స్థాయిలో నిర్ణీత సమయాలలో దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు.
ఖేడ్ ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి మాట్లాడుతూ త్వరలో మండలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రైతుల నుండి భూములకు సంబంధించి సమస్యలు, విజ్ఞప్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారి, మండల సర్వేయర్లను నియమించి తద్వారా క్షేత్రస్థాయిలో నూతన రికార్డుల నిర్వహణకు సులభతర చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. నాగోల్ గిద్దలో తహసిల్దార్ కార్యాలయంలో రికార్డు గదిని పరిశీలించారు. నాగలిగిద్ద మండల తాసిల్దార్ కార్యాలయ భవనం త్వరలో నిర్మిస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు.