25-04-2025 01:35:46 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ధరణి వల్ల అనేక సమస్యలు తలెత్తి రైతులకు ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి 25 చట్టాన్ని అమలులోకి తెచ్చిందని, ఈ చట్టం ద్వారా భూ సమస్యలకు సులువుగా పరిష్కారం లభిస్తుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్, కేసముద్రం మండలాల్లో శుక్రవారం భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ సమస్యలపై రైతులు అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు, సులువుగా న్యాయ సేవలు పొందవచ్చన్నారు.
క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చట్టంలో మార్పులు తేవడం జరిగిందని చెప్పారు. పూర్తిగా భూముల రక్షణ కోసం భూభారతి చట్టం పనిచేస్తుందన్నారు. అవగాహన కార్యక్రమానికి పహల్ గాం ఉగ్రదాడిలో మరణించిన మృతులకు నివాళులు అర్పించి ఆత్మ శాంతి కోసం మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అతనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి, ఆర్డీవో కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, ల్యాండ్ సర్వే ఏడీ నరసింహమూర్తి, కేసముద్రం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, ఏడిఏ శ్రీనివాస్ రావు, తహసిల్దార్లు భగవాన్ రెడ్డి, ఎర్రయ్య, ఎంపీడీవోలు రఘుపతి రెడ్డి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.