calender_icon.png 23 October, 2024 | 6:08 AM

వైరా నుంచి 2 లక్షల రుణమాఫీ

07-08-2024 02:08:19 AM

15న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

మాట ఇచ్చాం.. రుణమాఫీ అమలు చేస్తాం

విపక్ష పార్టీ అసత్య ప్రచారం నమ్మొద్దు

మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఈనెల 15వ తేదీన ఖమ్మం జిల్లాలోని వైరాలో రైతులకు రూ.౨ లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. అర్హులైన రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు.

రుణమాఫీపై విపక్ష పార్టీ ప్రచారాన్నినమ్మొద్దని సూచించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని కోరుతున్నారని, అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని మాఫీ చేస్తే బాగుంటుందని విపక్షాలకు కౌంటర్ వేశారు.

ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొనేందుకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రుణమాఫీలో 30 వేల బ్యాంకు ఖాతాల్లో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని వెల్లడించారు. ఇప్పటికే 17 వేల ఖాతాలకు సంబం ధించిన సమస్యలు పరిష్కరించామని తెలిపారు.

గతం అధికారంలో ఉండి ఏమీ చేయ లేకపోయిన నాయకులు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి వరణుడు కరుణించడంతో కృష్ణా బేసిన్‌లో చాలా రోజుల తరు వాత అన్ని ప్రాజెక్టులు నిండాయని హర్షం వ్యక్తం చేశారు. గోదావరిలో కొంత లోటు ఉందని, ఇంకా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోందని తెలిపారు.

అన్ని పంటలు వేసుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని అన్నారు. రైతులకు విత్తనాల కొరత లేకుండా సరఫరా చేశామని, కేంద్రం కొంత ఆనాసక్తిగా ఉన్నా ఎరువులకు ఇబ్బంది లేదని హామీ ఇచ్చారు. యూరియా, డీఏపీ గతంలో కేంద్రం అనుకున్నంతగా సరఫరా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్ర రైతులకు సమృద్దిగా ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు.