బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు
హైదరాబాద్, జూలై 21 ( విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని బీకేఎంయూ (భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ ) జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకట నలో డిమాండ్ చేశారు. గత పదేళ్ల్ల పాలనలో మోదీ ప్రభుత్వంగ్రామీణపేదల, వ్యవసాయ కార్మికుల సంక్షే మం కోసం, ఉపాధి కోసం ఏ ఒక్క పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టకపోగా యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకుందని ఆరోపించారు. ప్రతి సంవత్సరం ఉపాధి నిధులలో కోత పెట్టి కూలీల పొట్ట కొట్టిన ఫలితంగా ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో రైతులు వ్యవసాయకార్మికులు లోక్సభలో మోదీకి మెజార్టీ తగ్గించి గుణపాఠం చెప్పారన్నారు. జాబ్ కార్డులు కలిగి ఉన్న ప్రతిఒక్కరికీ సంవత్సరంలో 200 రోజులు పని కల్పించాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా రోజుకు రూ. 700 కనీస కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు..