పీడబ్ల్యూసీ అంచనా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: దేశంలో వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్ వచ్చే ఐదేండ్లలో రెట్టింపై రూ.14.19 లక్షల కోట్లకు చేరుతుందని పీడబ్యూసీ ఇండియా తాజా నివేదికలో అంచనా వేసింది. 2023-24లో బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల నేతృత్వంలోని వ్యవస్థీకృత బంగారం రుణాల మార్కట్ గణనీయంగా వృద్ధిచెంది రూ.7.1 లక్షల కోట్లకు పెరిగిందని, ఐదేండ్లలో చక్రగతిన 14.85 శాతం చొప్పున పెరిగి 2029 ఆర్థిక సంవత్సరానికల్లా రూ.14.19 లక్షల కోట్లకు చేరుతుందని పీడబ్ల్యూసీ వివరించింది.
భారత కుటుంబాల వద్ద భారీ పరిమాణంలో 25,000 టన్నుల బంగారం ఉన్నదని, వాటి ప్రస్తుత విలువ రూ.126 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది.
లోన్ టూ వాల్యూ (ఎల్టీవీ) శాతం, వేలం సంబంధిత నియమాలకు సంబంధించి బంగారం రుణాలిచ్చే సంస్థలపై రెగ్యులేటర్ల స్క్రూటినీ పెరుగుతున్నందున, వచ్చే రెండేండ్లు గోల్డ్ లోన్ మార్కెట్ వృద్ధి ఓ మోస్తరుగా ఉంటుందని నివేదిక పేర్కొంది.
బంగారం రుణాలు తీసుకునేవారికి రూ.20,000 మించి నగదును ఇవ్వరాదంటూ ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ ఆదేశించినందున, కస్టమర్లు అవ్యవస్థీకృత గోల్డ్ లోన్ రంగంవైపు మళ్లుతారని పీడబ్ల్యూసీ అభిప్రాయపడింది.