calender_icon.png 25 October, 2024 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ ఆమోదం లేకుండానే 2.89 లక్షల కోట్ల వ్యయం!

04-08-2024 01:35:33 AM

  1. అంకౌంటింగ్ ప్రమాణాలను పాటించని బీఆర్‌ఎస్ సర్కార్ 
  2. పద్దుల సమర్పణలో జాప్యం
  3. 2022-23 నివేదికపై కాగ్ 

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): 2014-15 నుంచి 2021-22 మధ్య కాలంలో కేటాయింపులకు మించి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం రూ.2,89,115 కోట్లను అదనంగా వ్యయం చేసిందని, దీనికి శాసనసభ ఆమోదం లేదని కాగ్ విమర్శించింది. ఇది రాజ్యాంగంలోని 204 అధికరణ ఉల్లంఘనగా పేర్కొంది. 2022 వార్షిక పద్దుల నివేదికను కాగ్ అందజేసింది.  2023 లోనూ కేటాయింపులకు మించి ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించింది. ఆ ఏడాది దాదాపు రూ.8,985 కోట్లను ఖర్చు చేసిందని వివరించిం ది.

ఉదయ్ స్కీమ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేరినప్పటికీ నిబంధనలు పాటిచంలేదని, తద్వారా వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు చేసిన రూ.7,061 కోట్లకు అసెంబ్లీ ఆమోదం లేదని ఎత్తిచూపింది. రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థలో చేసిన రూ.122 కోట్లకు ఆమోదం లేదని తెలిపింది. రాష్ట్రంలోని ఐదు తహసీల్దార్ కార్యాలయాల్లో భూమి మార్కెట్ విలువను తగ్గించారని, దీని వల్ల క్రమబద్ధీకరణ రుసుం భారీగా తగ్గిందని కాగ్  అభిప్రాయపడింది. ప్రభుత్వ ఖజానాకు రూ.3.22 కోట్ల ఆదాయం తగ్గిందని చెప్పింది.  

వార్షిక పద్దులు గడువులోపు సమర్పించలే

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలో గత సర్కారుపై కాగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. కేసీఆర్ సర్కారు అకౌంటింగ్ ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించలేదని చెప్పింది. 29 స్వయం పాలక సంస్థల వార్షిక పద్దులను గడువులో సమర్పిచలేదని, తద్వారా వాటి పద్దులను ఇందులో పొందుపర్చలేదని పేర్కొంది. వార్షిక పద్దుల సమర్పణలో జాప్యం వల్ల జవాబుదారీతనం ఉండదని అన్నది. తెలంగాణలో 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే దాదాపు 55 సంస్థల ఆర్థిక ప్రణాళికను గడువులోగా సమర్పిచలేదని వివరించింది. ప్రభుత్వ రంగ సంస్థలు వార్షిక పద్దులను సకాలంలో సమర్పించేలా సర్కారు ఒత్తిడి తేవాలని సూచించింది. 

పూచీకత్తులను వెల్లడించలే

2022-23 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తుల విలువ రూ.1,98,244 కోట్లు అని కాగ్ చెప్పింది. ఇందులో పౌరసరఫాల సంస్థ, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు ఇచ్చిన పూచీకత్తుల గురించి ప్రభుత్వం వెల్లడించకపోవడంపై అభ్యంతరం తెలియజేసింది. అంతేకాకుండా, రాష్ట్ర డిస్కీంలకు సంబంధించి ప్రభుత్వం వెల్లడించిన మొత్తానికి రూ.16కోట్లు తక్కువగా ఉందని వెల్లడించింది. 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు తెలంగాణ జీఎస్‌డీపీలో రూ.29.70శాతం అప్పులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితికి అదనంగా 5.94శాతం అప్పులు ఉన్నట్లు కాగ్ వివరించింది. ప్రభుత్వం అధనంగా తీసుకున్న రుణాలు రాష్ట్ర అర్థిక స్థితిగతులపై గణనీయమైన ఒత్తడిని కలిగిస్తాయని కాగ్ చెప్పింది. ఇది రాష్ట్రాన్ని అవాంఛనీయ స్థాయికి తీసుకెళ్లే ప్రమాదం ఉందని చెప్పింది.