పాకిస్థాన్ నుంచి ఏకే 47 తుపాకులు
ముంబై, అక్టోబర్ 17: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ను హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వేసిన ప్లాన్లు పోలీసులకే వణుకు పుట్టిస్తున్నాయి. మహారాష్ట్రలోని పన్వెల్ వద్ద సల్మాన్కు ఫామ్ హౌస్ ఉన్నది. ఆయన అక్కడికి తరుచూ వెళ్తుంటారు. అక్కడే ఈ నటుడిని హత్యచేసేందుకు గుజరాత్లోని సబర్మతి జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ఓ ముఠాకు రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు నవీముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. సల్మాన్పై కాల్పులు జరిపేందుకు సుపారీ తీసుకొన్న ముఠా 18 ఏండ్ల లోపు యువకులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. ఆయుధాలను పాకిస్థాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని ప్లాన్ వేశారు. అవి కూడా మామూలువి కాదు. ఏకే 47, ఏకే 92తోపాటు టర్కీలో తయారయ్యే జిగానా తుపాకులు తెప్పించాలని ప్రణాళిక రచించినట్లు తెలిసింది. శిక్షణ పొందిన బాలలంతా పుణె, రాయ్గఢ్, నవీ ముంబై, థానె, గుజరాత్లో దాక్కున్నట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తిచేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఏకంగా 70 మందిని నియమించి సల్మాన్ ప్రతి కదలికను గమనించిందని గుర్తించారు.