హైదరాబాద్,(విజయక్రాంతి): అంబర్ పేట్ నియోజకవర్గం, గోల్నాక డివిజన్ లోని తులసీరామ్ నగర్ లో మూసీ పరివాహక ప్రాంతాలోని హైడ్రా బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో కలిసి తలసాని శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్ మూసీ పరివాహక ప్రాంతాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ లో లక్షలాది మందికి హైడ్రా నిద్రలేకుండా చేస్తుందన్నారు. అధికారులు వచ్చి ఎప్పుడు తమ ఇళ్లను కూల్చుతారో అని ప్రజలు ఆవేదనలో ఉన్నారని, నగరంలో బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి పగపట్టారని కేటీఆర్ ఆరోపించారు.
మూసీ మే లూఠో.. ఢిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ పార్టీ నినాదం అని, రాష్ట్ర బడ్జెట్ లో సగం డబ్బులతో మూసీ ప్రక్షాళన చేపట్టారని పేర్కొన్నారు. మూసీ పరివాహక వాసులను అడవిలోకి పంపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్ల వద్దకు బుల్డోజర్ వస్తే కంచె అడ్డుపెట్టాలని, ఇప్పుడు పేదల ఇళ్లు కూల్చి.. ఇందిరమ్మ ఇళ్లు కడతామంటూ కూల్చుతున్నారు.పేదల ఇళ్లు కూల్చుతుంటే మీ ప్రాంత ఎంపీ ఎక్కడికీ వెళ్లారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడబలుక్కున్నారా..?, పేదలకు కష్టం వస్తే అండగా ఉండేవాడే దేవుడు అని కేటీఆర్ చెప్పారు.