- కుమారుడి కోసం వెళ్లినట్లు చర్చ
- వచ్చే నెల 5నుంచి మాస్కోలో పర్యటన
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): అమెరికా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. తన సోదరి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన ఇంటికి చేరుకున్న అరగంట వ్యవధిలోనే కేటీఆర్ అమెరికా పర్యటన వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఆయన కుమారుడు హిమాన్షురావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.
ఈనేపథ్యంలో కుమారుడి చదువుకు సంబంధించి అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్కు బయలుదేరారు. తండ్రి బాధ్యత పిలుస్తోందని అనే అర్థం వచ్చేలా కేటీఆర్ ఎక్స్లో పోస్టు చేశారు. బుధవారం ఢిల్లీ నుంచి కవితతో పాటు కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె నివాసంలో కాసేపు కుటుంబ సభ్యులతో గడిపిన కేటీఆర్ అటునుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని యూఎస్ బయలు దేరారు.
వచ్చే నెల 5 నుంచి మాస్కో పర్యటన..
రష్యాలోని మాస్కోలో స్కోల్కోవో స్టార్టప్ సంస్థ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ఈవెంట్లో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్కు ఆహ్వానం అందింది. ప్యూచరిస్టిక్ అనే అంశంపై భవిష్యత్లో ఉండే అవకాశాలు, వాటిని వినియోగించుకునే విధానాలపై ఆరగంట పాటు మాట్లాడాలని కేటీఆర్ను నిర్వాహకులు ఆహ్వానించారు. రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 నుంచి 7వ తేదీవరకు ఫెస్టివల్ ఆఫ్ ది ప్యూచర్ పోర్టల్ 2030 భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కేటీఆర్ చేసిన కృషి అద్భుతమంటూ ఆహ్వానంలో నిర్వాహకులు అభినందించారు.