10-02-2025 05:44:50 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కొండగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. కొడంగల్ లో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిగా కౌరవ పాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు. లగచర్ల, రోటిబండతండా, హకీమ్ పేట్, పోలేపల్లి, పులిచెర్లకుంట తండా రైతులను కేటీఆర్ కలిశారు. కొడంగల్ లో ఎప్పుడు ఉపఎన్నిక వస్తుందా..?, వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడిద్దామని ప్రజలు చూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేయారని, రేవంత్ రెడ్డి 50 వేల కంటే తక్కువ మెజార్టీతోనే గెలుస్తారు కానీ, 50 వేల కంటే ఎక్కువ ఓట్లతో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజల కోసం పని చేయడం లేదని, అన్నదమ్ములు, అదానీల కోసం పని చేస్తూ రూ.కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. తమ నియోజక వర్గం ఎమ్మెల్యే సీఎం అయితే వారికి మంచి చేస్తారని భావించిన ప్రజల భూములను గుంజుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.