calender_icon.png 24 September, 2024 | 2:42 PM

ఎంబీబీఎస్ ప్రవేశాల్లో జాప్యంపై స్పందించిన కేటీఆర్

24-09-2024 12:10:09 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఎంబీబీఎస్ ప్రవేశాల్లో జాప్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య విద్య ప్రవేశాలు చేసేదెప్పుడు?, ఎంబీబీఎస్ ప్రవేశాలకు డెడ్ లైన్ సమీపిస్తున్నా.. ఈ డైలమాకు తెరదించేదెప్పుడు? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో ప్రశాంతంగా, పకడ్బందీగా సాగిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ సాగిందని, కాంగ్రెస్ వచ్చిన తొలి ఏడాదే ప్రవేశాల్లో ఎందుకింత అస్తవ్యస్థం?, అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసేలా రాష్ట్రం ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 33 తోనే ఈ సమస్యలు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనవసరం జీవో తెచ్చి... అడ్మిషన్ల ప్రక్రియను ఆగం చేసిన ముఖ్యమంత్రి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ తెలిపారు. స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశించినప్పటికి మళ్లీ సుప్రీంకోర్టు ఆశ్రహించారని ఆయన మండిపడ్డారు. అత్యున్నత న్యాయస్థానం కూడా తీర్పుచెప్పి నాలుగు రోజులు గడుస్తున్నా.. వైద్య విద్య ప్రవేశాల్లో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం లేదన్నారు.

ఇతర రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరిందని, తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక్క అడుగు  కూడా ముందుకు పడకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అక్టోబర్ 31 లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయకపోతే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరిచి వైద్యవిద్య అడ్మిషన్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టి డెడ్ లైన్ లోగా పూర్తిచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.