23-03-2025 09:51:34 AM
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Taraka Rama Rao) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, చేయని శపథం లేదు, ఆడని అబద్దం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు ఇచ్చారని విమర్శించారు. నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతుల గుండెలపై ఇందిరమ్మ రాజ్యం గునపం దింపిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ కు కపట కాంగ్రెస్(Congress) తూట్లు పొడిచిందని పేర్కొన్నారు. అధికారం కోసం అందరికి రుణమాఫీ, అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ చేశారని ఆరోపించారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు- పెట్టెలో ఓట్లు పడ్డాయ్-జేబులో నోట్లు పడ్డాయ్-ఢిల్లీకి మూటలు ముట్టాయ్ ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ యవ్వారం ఉందని కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. రూ.2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారు.. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెబుతున్నారని మండిపడ్డారు. నాడు రూ. 2 లక్షలు దాటినా రుణమాఫీ అన్నారు. ఇప్పుడేమో రూ. 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారు. నాడు ఓట్ల కోసం హామీలు .. నేడు ఎగవేత కోసం కొర్రీలన్న కేటీఆర్ మిస్టర్ రాహుల్ గాంధీ, తెలంగాణసే మాఫీమాంగో అని ఆయన డిమాండ్ చేశారు.