calender_icon.png 24 October, 2024 | 8:44 AM

విద్యార్థుల తల్లితండ్రులకు గర్భశోకం మిగల్చవద్దు

12-08-2024 06:04:12 PM

బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేస్తున్నట్లు ప్రకటన

ఈ 8 నెలల కాలంలో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు

మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శ

రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వం సంక్షేమ పాఠశాలలు, సంక్షేమ వసతులతో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే తల్లిదండ్రుల మాదిరిగా బాధ్యత తీసుకోవాలని మిగితా విద్యార్థుల తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. అనిరుధ్ అనే చిన్నారి మరణం ఆ తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించి రాజకీయాలు వద్దు. మన అందరికీ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత బాధ ఉంటదో అర్థం చేసుకోగలమన్నారు. కొందరు విషాహారం తిని, మరికొందరు పాముకాట్ల కారణంగా, ఇంకొందరు విద్యార్థులు అనుమానాస్పదంగా చనిపోవటం బాధాకారం. చనిపోవటమే కాదు 500 వందల పిల్లలు విషాహారం తిని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.

పిల్లలు బాగుండాలి, వారు ప్రపంచంతో పోటీపడే విధంగా చదువుకోవాలని మనం వెయ్యికి పైగా  గురుకులాలు పెట్టుకున్నామన్నారు. వాటిని ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలుగా కూడా అప్‌గ్రేడ్ చేసుకున్నామన్నారు.  ఈ విషయంలో రాజకీయం వద్దు చనిపోయిన 36 మంది విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.మిగతా తల్లులకు కూడా మళ్లీ ఇలాంటి గర్భశోకం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ మీద ఎంతో ఆశపెట్టుకుంటారు. అలాంటి వారి పిల్లలు చనిపోతే మొత్తం వాళ్ల ఆశలే లేకుండా పోతా యన్నారు. ఈ విషయంలో మేము రాజకీయం చేయాలనుకోవటం లేదు.

ప్రభుత్వం బేషజాలకు పోవద్దు గతంలో గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన కమిటీ వేస్తున్నామన్నారు. ఒక 20 పాఠశాలలను పరిశీలించిన చేపట్టాల్సిన చర్యలను ఆయన ఐదారు రోజుల్లో నివేదిక ఇస్తారన్నారు. ప్రభుత్వానికి సూచనలు చేసే మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాం.. దీన్ని రాజకీయంగా భావించవద్దన్నారు. పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు.

 గతంలో మేము బాసరలో విద్యార్థులకు ఆహారం విషయంలో భరోసా ఇచ్చామన్నారు. కలెక్టర్లు, అధికారులు సంక్షేమ హాస్టల్స్ సర్‌ప్రైజ్ విజిట్ చేసి ఆహార నాణ్యత ఎలా ఉందో పరిశీలించాలన్నారు. ప్రతి పాఠశాల ఆవరణలను శుభ్రం చేయించాలన్నారు. ఈ పిల్లలు మన పిల్లలు.. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న ఆరున్నర లక్షల మంది పిల్లలకు ప్రభుత్వమే తల్లితండ్రులని అన్నారు. ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితిని అర్థం చేసుకోని మంచి చేయాలని కోరుతున్నామన్నారు.