11-02-2025 05:23:21 PM
హైదరాబాద్: అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారని తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో ఖమ్మం జిల్లా నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. మొన్నటి ఖమ్మం వరదల సమయంలో అక్కడి ప్రజలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చారని చెప్పారు. బర్త్ డే ఫంక్షన్ లకు పోవడానికి హెలికాప్టర్ లను ఉపయోగిస్తున్న మంత్రులు, ఖమ్మం వరదలప్పుడు మాత్రం హెలికాప్టర్ లు పంపలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనానికి ఓ కుటుంబం వదరల్లో కొట్టుకుపోయిందని కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. 2014 తర్వాత ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అసాధారణ అభివృద్ధి చేసింది. పువ్వాడ అజయ్ లాంటి ఉత్సాహవవంతమైన నాయకుడు ఓడిపోవడం బాధాకరం అన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్ కు కొంత నష్టం జరిగిందని చెప్పారు. ఓడిపోయినా కూడా ప్రజలకు కష్టం వస్తే బీఆర్ఎస్ నాయకులు గులాబీదండు ఈ సంవత్సర కాలంగా ప్రజలకు అండగా ఉందన్నారు. ఖమ్మంలో వరదలు వస్తే ప్రజలకు పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చాడని తెలిపారు.
డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదని ఆరోపించారు. ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు లేదని విమర్శించారు. ఎమ్మెల్యేల పుట్టినరోజులకు ఇంకా వేరే పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్ నుంచి కూతవేటు దూరానికి కూడా హెలికాప్టర్లలో పోతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో వరదలు వచ్చినప్పుడు భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా నాలుగు హెలికాప్టర్లను పంపి ప్రజలను కాపాడామని గుర్తుచేశారు. మాకు ప్రాణం విలువ తెలుసు అన్నారు. వరద తగ్గుముఖం పట్టినంకనే ఖమ్మంలో మంత్రులు పర్యటించారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఓపెన్ టాప్ జీపులో చేతులు ఊపుతూ కాలు కింద పెట్టకుండా అటు ఇటు తిరిగి వెళ్లిపోయాడని తెలిపారు. ప్రజలు తిడుతున్న తిట్లను వింటే పౌరుషమున్న ఎవరైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని ఎద్దేవా చేశారు. కానీ కానీ రేవంత్ రెడ్డికి రేశం లేదు కాబట్టి అన్ని దులుపుకొని తిరుగుతున్నాడని ఆరోపించారు.
మా స్కూటీ ఏమైందని కాలేజీ పిల్లలు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని అనుకోని వర్గం ఏది ఈ రాష్ట్రంలో లేదన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని పనులతో పాటు తెలంగాణలోని ప్రతి పని కాంట్రాక్టు కూడా ఇవ్వాళ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంట్రాక్టు మంత్రి, ఆయన కమిషన్ల కోసమే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని నిన్న కొడంగల్ లో చెప్పానన్న కేటీఆర్ డిప్యూటీ సీఎం 30శాతం కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నారని వెల్లడించారు. వ్యవసాయ మంత్రి రుణమాఫీ కాలేదని చెప్తే సీఎం మాత్రం మొత్తం రుణ మాఫీ అయిందంటారు. ఇలా మంత్రులకి ముఖ్యమంత్రికి శృతి లేదు. ఫలితంగా తెలంగాణ అధోగతి పాలయిందని ద్వజమెత్తారు. బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొన్నారు.
42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, సబ్ ప్లాన్ అమలు చేస్తామని లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని ఐదు వందల శాతం బీసీ జనాభాను తగ్గించిందని మండిపడ్డారు. కేసీఆర్ చేపించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51.5 శాతం ఉంటే రేవంత్ చేసిన కులగరణ సర్వేలో ఐదున్నర శాతం తగ్గించి 46శాతాకి బీసీ జనాభాను చూపిస్తుందన్నారు. తెలంగాణలోని ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉందన్నారు. సంవత్సర కాలంగా కేసులు పెట్టి వేధిస్తున్నా.. విచారణల పేరిట పిలిచి జైల్లో పెడతామని బెదిరిస్తున్నప్పటికీ, ప్రజా సమస్యల మీద రేవంత్ రెడ్డితో కొట్లాడినం. భవిష్యత్తులోనూ కొట్లాడుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైం అయిపోయిందని చెప్పిన కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న ఓ మంత్రిని తులం బంగారం లేదని మహిళలు ప్రశ్నించారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కేటీఆర్ చమత్కరించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుతంత్రాలను గులాబీ దండు అడ్డుకుంటుందని వ్యాఖ్యానించిన కేటీఆర్ త్వరలోనే ఖమ్మం వస్తానన్నారు.