calender_icon.png 28 October, 2024 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలిక ఊడినట్టుంది!

13-07-2024 09:41:14 AM

హైదరాబాద్: కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోందని విమర్శించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారని వెల్లడించారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుండి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని కేటీఆర్ సూచించారు. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని హెచ్చరించారు.