19-04-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి డాక్టర్ మన్నె క్రిశాంక్ శుక్రవారం మూడోసారి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై అయన్ను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ౨సార్లు క్రిశాంక్ విచారణకు హాజరయ్యారు. తాజాగా శుక్రవారం మూడోసారి గచ్చిబౌలి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఈ క్రమంలో వీడియోల ప్రామాణికతపై క్రిశాంక్ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లోని చెట్లు నరికే క్రమంలో పలు వన్య ప్రాణులు మృత్యువాత పడినట్లు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అవి ఫేక్ అని, ఏఐ జనరేటెడ్ వీడియోలతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాలపై కాంగ్రెస్ మండిపడింది. ఏఐ ఫొటోలను క్రిశాంక్ సృష్టించాడని ఆరోపణలు రావడంతో పోలీసులు విచారణ చేపడుతున్నారు.