calender_icon.png 21 September, 2024 | 4:44 PM

మంథనిలో సహకార సంఘం స్ఫూర్తిని కొనసాగించిన దార్శనీకుడు మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి

21-09-2024 02:49:03 PM

సంతాప సభలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని (విజయక్రాంతి): మంథని లో సహకార సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ సహకార సంఘం స్ఫూర్తిని కొనసాగించిన దార్శనీకుడు మాజీ చైర్మన్ మదాడి సత్యనారాయణ రెడ్డి అని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. శనివారం మంథని సహకార సంఘం కార్యాలయంలో సహకార సంఘం మాజీ చైర్మన్, కెడిసిసి బ్యాంక్ కరీంనగర్ ఉపాధ్యక్షుడు మాదాడి సత్యనారాయణ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా  చైర్మన్ శ్రీనివాస్, ప్రస్తుత, గత పాలకవర్గ సభ్యులు సత్యనారాయణ రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సత్యనారాయణ రెడ్డి ఎస్సారెస్పి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా పనిచేశారని, మంథని ప్రాంతంలోని టేలెండ్ ప్రాంతాలకు నీరందించిన ఘనత సత్యనారాయణదేనన్నారు. రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటూ ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని మంత్రి  శ్రీధర్ బాబు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన సమయంలో మాట్లాడిన మాటలను ఆయన గుర్తు చేశారు. శ్రీధర్ బాబు సహాయ సహకారాలతో సింగిల్ విండో చైర్మన్, కెడిసిసి బ్యాంక్ ఉపాధ్యక్షులుగా ఎన్నికై మంథని లో సంఘం పెంకుటిల్లులో ఉన్న సంఘ కార్యాలయానికి సత్యనారాయణ రెడ్డి, అప్పటి పాలకవర్గం సమిష్టి కృషితో పక్కా భవన నిర్మాణం కోసం డిసిఎంఎస్ భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి కార్యాలయ భవన నిర్మాణం, గోదాం నిర్మాణం చేపట్టారన్నారు.

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారం తో సహకార సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లు నిర్వహించారని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతులకు ఎరువుల కొరత లేకుండా తీర్చారని, ఆయన హాయాంలో వెంకటాపూర్ లో గోదాం నిర్మాణం కోసం భూమి కొనుగోలు చేశారన్నారు. ఆయన స్ఫూర్తిని తమ పాలకవర్గం కొనసాగిస్తూ రైస్ మిల్లర్ల దోపిడి నుంచి రైతులను కాపాడేందుకు నాగారం గ్రామ శివారులో రైస్ మిల్లు నిర్మాణానికి భూమి కొనుగోలు చేశారని, ఈ సందర్భంగా ప్రస్తుత, గత పాలకవర్గ సభ్యులు సత్యనారాయణ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ముందుగా, రెండు నిమిషాల మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాబు, పెద్దిరాజు ప్రభాకర్, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మీ-మొండయ్య, దేవళ్ల విజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన పెండ్రు రమ-సురేష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మూల సరోజన, ఏఎంసి మాజీ చైర్మన్ లు అజీంఖాన్, ఆకుల కిరణ్, సంఘ మాజీ ఉపాధ్యక్షుడు కూర కోటేష్, మాజీ డైరెక్టర్లు గూడ రాజిరెడ్డి, మెట్టు నోమారెడ్డి, రయీస్ అహ్మద్, గూడెపు శ్రీనివాస్, నాయకులు గుండా పాపారావు, బెజ్జంకి డిగంబర్, మంథని విజయ్ కుమార్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది, రైతులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.