06-03-2025 01:04:24 AM
రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
కోరుట్ల, మార్చి 5 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్లలోని పోలీస్ స్టేషన్లో ఎస్సు-3 గా రూపవత్ శంకర్ ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 5000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి,సీఐ చందర్, బాధితుడు బండారి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్ పల్లి శివారులో గత నెల 21న ఓ మామిడి తోటలో 8 మంది పేకాట ఆడుతూ పట్టుపడ్డారు. వీరి వద్ద నుంచి రూ. 23,000 నగదు స్వాధీనం చేసుకున్న స్పెషల్ బ్రాం పోలీసులు కోరుట్ల పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న కోరుట్ల టౌన్ 3 ఎస్సు శంకర్ పేకాట ఆడిన 8 మంది వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లను విచారణ అనంతరం 7 గురు వ్యక్తులకు ఫోన్లు తిరిగి ఇచ్చారు.
కాగా రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్ అనే వ్యక్తికి రూ.5000 లంచం ఇస్తేనే ఫోన్ ఇస్తానని డిమాండ్ చేశాడు. పేకాటలో పట్టుబడ్డ ఏడుగురు వ్యక్తులు కూడా కొంచెం డబ్బులు ఇచ్చి ఫోన్లు తీసుకున్నారని రూ. 4300 ఖచ్చితంగా ఇవ్వాలని ఎస్సు శంకర్ శ్రీనివాస్ ను ఫోన్లో పదే పదే బెదిరించసాగాడు. దీంతో శ్రీనివాస్ విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సూచనల మేరకు బుధవారం ఎస్సుకి శ్రీనివాస్ రూ. 5 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.