calender_icon.png 11 October, 2024 | 2:52 AM

కొండారెడ్డిపల్లికి కొత్తకళ

11-10-2024 12:46:03 AM

సర్వాంగ సుందరంగా ముఖ్యమంత్రి స్వగ్రామం

సీఎం హోదాలో తొలిసారిగా స్వస్థలానికి..

రేపు దసరా సందర్భంగా ప్రారంభోత్సవాలు

కల్వకుర్తి (నాగర్‌కర్నూల్) అక్టోబర్ 10 (విజయక్రాంతి): కొండారెడ్డిపల్లికి కొత్తకళ వచ్చింది. ఒకప్పుడు మారుమూలకు విసిరేసినట్లు ఉండి, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ గ్రామానికి ఇప్పుడు సకల సౌలతు లు వచ్చాయి.

వీధుల్లో సోలార్ వెలుగులు, ప్రభుత్వ బడి, గుడి, ఆసుపత్రి, పాల శీతలీకరణ కేంద్రాలు,  అత్యాధునికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, ఫోర్ లేన్స్ రహదారులు, పశువైద్య కేంద్రం, పంచాయతీ భవనం, గ్రంథాలయం, సామాజిక సంఘాల భవనం అందుబాటులోకి వచ్చాయి.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ సదు పాయాలన్నింటినీ కల్పించడంపై గ్రామస్తు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య మం త్రి హోదాలో ఆయన తొలిసారి స్వగ్రామానికి విచ్చేస్తున్నారు. శనివారం దసరా పర్వదినాన స్వయంగా సీఎం అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

భారీగా నిధులు..

సర్కార్ గ్రామంలో పశు వైద్య కేంద్రం నిర్మాణానికి రూ.45 లక్షలు, పంచాయితీ భవన నిర్మాణానికి రూ.60 లక్షలు, అండ ర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.10 కోట్లు, బీసీ సంక్షేమ సంఘం భవనానికి రూ.50 లక్షలు, గ్రంథాలయ భవనానికి రూ.50 లక్షలు, పాల శీతలీకరణ కేంద్ర నిర్మాణానికి రూ.90 లక్షలు నిధులు విడుదల య్యాయి. ఆ నిధులతో అధికారులు అభివృద్ధి పనులను పూర్తి చేశారు.

అలాగే ప్రస్తుతం రూ.18 కోట్లతో ఫోర్‌లేన్ రహదారి పనులు జరుగుతున్నాయి. రైతు వేదిక నిర్మాణమూ ఇప్పటికే పూర్తయిం ది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించాల్సి ఉన్నది. గ్రామంలోని ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు సర్కార్ రూ.15 కోట్లు కేటాయించింది. అధికారులు ఈ ప్రాజెక్టును పైలెట్ ప్రాజె క్టు కింద చేపడుతున్నారు.