calender_icon.png 21 October, 2024 | 3:01 AM

కోమటిరెడ్డి నోరు మూసీకంటే అధ్వానం

21-10-2024 12:59:45 AM

*మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నోరు మూసీనది కంటే అధ్వానంగా మారిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శిచారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో మూసీ నది ఏవిధంగా ఉండేదో రైతులను అడిగితే తెలుస్తుందని, మూసీకి కాలుష్యం లేకుండా నీళ్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిందన్నారు. కోమటిరెడ్డి సోదరులు నల్గొండ జిల్లాకు చేసిన మంచి ఏమిటో చెప్పాలన్నారు.

కాంగ్రెస్ వదిలేసిన ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ పూర్తి చేసిందని చెప్పారు. మంత్రి అనుచరులు సబ్‌స్టేషన్ పరికరాలను అమ్ముకున్నారని, ఆయన స్వంత గ్రామమైన బ్రాహ్మ ణవెల్లంలో సబ్‌స్టేషన్ మాయమైందన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వెంకట్‌రెడ్డి నల్గొండను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. నల్గొండకు మెడికల్ మంజూరు, బత్తాయి మార్కెట్, ఐటీ హబ్‌ను కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిందని గుర్తు చేశారు.

పది నెలల కాంగ్రెస్ పాలనలో రెండు కిలోమీటర్ల రోడ్డును కోమటిరెడ్డి వేయించలేకపోయారని ఎద్దేవా చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్రమార్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్‌ఎస్ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మూసీని మురికికూపంగా మార్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలేనని వాపోయారు.