calender_icon.png 19 October, 2024 | 10:14 PM

వివాహితపై కన్నేసి.. ఆమె కుమార్తెను హతమార్చి..

16-10-2024 01:24:25 AM

మేడ్చల్‌లో వెలుగు చూసిన ఘటన

మేడ్చల్, అక్టోబర్ 15: బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. వివాహితపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమె కుమార్తెను దారుణంగా హతమార్చి చెట్ల పొదల్లో పడేశాడు. ఈ హృదయ విదారకమైన ఘటన మంగళవారం మేడ్చల్‌లో వెలుగు చూసింది. మేడ్చ ల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం పోలీస్‌స్టేషన్‌కు ఈ నెల 13న జ్యోత్స్న(7)  అనే బాలిక కనిపించడం లేదనే ఫిర్యాదు అందింది.

పోలీసులు వెంటనే నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు ప్రారంభించారు. బాలిక చివరిసారిగా తిరుపతి అనే వ్యక్తి బైక్‌పై వెళ్లినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బాసురగడి శివారులో చెట్ల పొదల్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా ఆంకోల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల బతుకు దెరువుకు సూరారం జీవనజ్యోతి నగర్‌కు వలసొచ్చింది. ఆ కుటుంబానికి చెందిన వివాహితపై తిరుపతి అనే వ్యక్తి కన్నేశాడు.

మున్ముందు అందుకు బాలిక అడ్డుగా ఉండకూడదని భావించాడు. బాలికను హతమార్చి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. దీనిలో భాగంగానే 13వ తేదీ రాత్రి బాలికకు మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు. బాసురగడిలో బాలికను కత్తితో పొడిచి హతమార్చాడు.