మోడీని కలసి రైతుల కోసం పోరాడండి.. 8 మంది బీజేపీ ఎంపీలకు కేకే సవాల్
తంగళ్ళపల్లి,మే 27 (విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రాక్టర్ను తాళ్లతో లాగుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మాట్లాడుతూ రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.రైతుల బాగు కోరితే రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు ప్రధాని మోడీని కలిసి ధాన్యం కొనుగోలు, రైతుల సమస్యలపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను నట్టేట ముంచుతూ రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమాలు నిర్వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పెట్రోల్–డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజల జీవితం మరింత భారంగా మారిందన్నారు. తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యంలో కేంద్రం సగం మాత్రమే కొనుగోలు చేస్తోందని, ఉత్తర భారతదేశంలో గోధుమలు కొనుగోలు చేస్తూ ఇక్కడి రైతుల పట్ల వివక్ష ఎందుకని ప్రశ్నించారు.రైతులకు ఉచిత విద్యుత్ అందించింది కాంగ్రెస్ పార్టీనేనని, రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టిందీ కాంగ్రెస్ పార్టీయేనని కేకే గుర్తు చేశారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రతి గింజను కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతుల పట్ల ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శిస్తూ, రైతులు వారి మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రైతుల పక్షాన నిలుస్తుందని కేకే స్పష్టం చేశారు.






