నిందితుడికి జీవితఖైదు
ఎల్బీనగర్, అక్టోబర్ 24: మహిళ హత్య కేసులో నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. ముసారాంబాగ్లోని సలీమ్నగర్కు చెందిన శ్రీవేముల గోపి వాటర్ ట్యాంకర్ డ్రైవర్. 2021 నవంబర్ 12న పెద్దఅంబర్పేట ఔటర్రింగ్ రోడ్డులోని గండిచెరువు బ్రిడ్జి సమీపంలో చెట్లకు నీళ్లు పోయడానికి వెళ్లాడు.
అక్కడ నీటి తొట్టిలో ఓమహిళ మృతదేహం కనిపించడంతో అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల కు సమాచారం అందించగా, కేసు నమోదు చేశారు. విచారణలో సూర్యాపేట జిల్లా చౌటుపల్లికి చెందిన షేక్ బడేమియాని నిందితుడిగా గుర్తించారు. బడేమియా మహిళకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె వద్ద ఉన్న రూ.500 లాక్కోవడంతో పాటు బండరాయితో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు.
అనంతరం మృతదేహాన్ని పక్కన ఉన్న కాల్వలో పడేసి వెళ్లాడు. హత్య కేసులో పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలను ఎల్బీనగర్ కోర్టులో సమర్పించగా.. న్యాయమూర్తి హరీశ గురువారం నిందితుడికి జీవితఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు.