calender_icon.png 1 October, 2024 | 12:58 AM

గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం

05-09-2024 01:42:16 AM

  1. ముగ్గురు చిన్నారులను అపహరించిన ఆటోడ్రైవర్ 
  2. రక్షించిన మరో ఆటోడ్రైవర్ 
  3. నిందితుడిని పోలీసులకు అప్పగింత 
  4. బాధిత కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. ముగ్గురు చిన్నారులను ఓ ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా, మరో ఆటో డ్రైవర్ అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం ఉద యం మజీద్‌బండలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో గుర్తుతెలియని ఓ ఆటోడ్రైవర్ వచ్చి వారిని బలవంతంగా ఆటో ఎక్కించుకున్నాడు. చిన్నారుల్లో ఇద్దరు బాలురు, ఒక బాలిక ఉన్నారు. ఆటో మజీద్ బండ స్మశానవాటిక వైపునకు వెళ్తుండగా అనుమానంతో చిన్నారు లు డ్రైవర్‌ను ఎవరు నువ్వు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ గట్టిగా ప్రశ్నించారు. దీంతో అటుగా వెళ్తున్న మరో ఆటోడ్రైవర్ గమనించి అప్రమత్తమయ్యాడు. ఆటోను అడ్డుకుని డ్రైవర్‌ను సమీపంలోని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. పోలీసులు కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చిన్నారులను కాపాడిన ఆటోడ్రైవర్‌కు పోలీసులు, చిన్నారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.