- ఉమ్మడి జిల్లాలో 11 మంది పోలీస్ అధికారులకు మెమోలు
- కొంతమంది ఇప్పటికే బదిలీ.. మరికొందరు పాతస్థానాల్లోనే
- శాఖాపరమైన చర్యలకు డీజీపీ ఆదేశాలు
- కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు
- పోలీస్ అధికారుల్లో వణుకు
కామారెడ్డి,అక్టోబర్26(విజయక్రాంతి): ఇసుక మాఫియాను వెనుక నుండి ప్రోత్సహిస్తున్న పోలీస్ అధికారులపై కొరడా ఝళిపించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి నెలానెలా మామూళ్లు వసూళ్లు చేసిన పోలీస్ అధికారులను ఉన్నతాధికారులు గుర్తించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది పోలీస్ అధికారులు అక్రమ ఇసుక రవాణాకు ప్రోత్సహిస్తున్నారని ఉన్నతాధికారుల విచారణలో తెలింది. ఉమ్మడి జిల్లాలోని 9 మంది ఎస్సైలు, ఇద్దరు సీఐలు ఇసుక దందా మాఫియాకు ప్రోత్సహించారనే ఆరోపణలపై విచారణ కొనసాగించారు. బాధ్యులను గుర్తించి ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చారు. ఇప్పటికే అలాంటి అధికారులకు మోమోలను జారీ చేసినట్లు సమాచారం.
ఇసుక వాహనాలకు కాపలా..
బోధన్ సబ్ డివిజన్ పరిధిలో పనిచేసిన ఎస్సైకి బాల్కొండ నియోజకవర్గంలోని కీలకమైన స్టేషన్కు ఎస్హెచ్గా పోస్టింగ్ ఇచ్చారు. రుద్రూర్ సర్కిల్లో పనిచేస్తున్న ఓ ఎస్సై అర్థరాత్రి ఇసుక ట్రాక్టర్లు, లారీలకు కాపలాగా ఉండి మరీ అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తూ మామూళ్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ట్రాక్టర్, లారీ యాజమానుల నుంచి 20 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు.
రుద్రూర్, దర్పల్లి, డిచ్పల్లి, బోధన్ రూరల్ సర్కిల్లో పనిచేసిన ఎస్సైలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీరిలో కొందరు బదిలీ కాగా మిగతా వారు ఇప్పటికి పాత స్థానాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో మామూళ్ల మత్తుకు ఉత్తర్వులు చిత్తు అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అదనుగా పలువురు ఎస్సైలు మితిమీరి వ్యవహరిస్తున్నారని ప్రచారం కొనసాగుతుంది.
ఉన్నతాధికారుల అండదండలు..
కొందరి ప్రజాప్రతినిధుల అండదండలతో పాటు ఉన్నతాధికారుల అండదండలు తోడు అవ్వడంతో అక్రమాలకు పాల్పడుతున్న కొందరు స్టేషన్ అధికారులు యథేచ్చగా తమకు ఏమీ కాదనే ధీమాతో ఇసుక దందా రాయుళ్లతో చేతులు కలిపి అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొంతమంది పోలీస్ అధికారులు చేస్తున్న చర్యలు పోలీస్ శాఖకు మచ్చను తెచ్చిపెడుతున్నాయి.
కొంతమంది ముందుగానే బదిలీపై వెళ్లగా, మరికొంతమంది తమకు అండదండలు ఉన్నాయనే ఉద్ధేశంతోనే పాతస్థానాలలోనే తిష్టవేసి విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించి ఉత్తర్వులపై చర్యలు తీసుకుంటారా లేక తుంగలో తొక్కుతారో వేచి చూడాల్సిందే.
డీజీపీ నుంచి ఆదేశాలు..
అధికారుల పేర్లు, వివరాలతో కూడిన జాబితాతో మోమోలు జారీ చేశారు. ఉన్న ఫలంగా వారిని బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ అధికారిని ఇప్పటికే లూప్ లైన్లో పంపించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ డివిజన్ అధికారులుగా పనిచేసిన వారే బాధ్యులుగా విచారణలో తెలినట్లు సమాచారం. పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించే ఎస్సైలకు నెలానెలా లక్షల్లో మాముళ్లు అందినట్లు తెలుస్తుంది. బాన్సువాడ, బోధన్ సబ్ డివిజన్లో పనిచేసిన కొందరు అధికారులు ప్రస్తుతం బాల్కొ ండ నియోజకవర్గం పరిధిలోకి బదిలీ అయ్యారు.
కామారెడ్డి జిల్లా మద్నూర్ మం డలం హంగర్గ, లాంగన్గావ్లలో నడిచిన ఇసుక క్వారీల నుంచి 8 లక్షల వరకు పోలీ స్ అధికారులకు మామూళ్లు అందేవని మో మోలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.