calender_icon.png 10 October, 2024 | 12:43 PM

రతన్ టాటా మృతిపట్ల కేసీఆర్ సంతాపం

10-10-2024 10:34:32 AM

హైదరాబాద్: భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత సంతాపం ప్రకటించారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా అని కేసీఆర్ కొనియాడారు. అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరుకోవాలనే సామాజిక ఆర్థిక తాత్వికతను సొంతం చేసుకున్న అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని కేసీఆర్ తెలిపారు. 

సమాజ సంక్షేమం కోసం, రేపటి తరాల ఉజ్వల భబిష్యత్తుకోసం జీవితకాలం తపించిన రతన్ టాటా ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమానికి హాజరై, నూతన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలో సాధిస్తున్న అభివృద్ధిని అభినందించడం, సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో నాటి బిఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దార్శనిక కార్యాచరణ పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేయడం తెలంగాణ కు గర్వకారణమని కేసీఆర్ స్మరించుకున్నారు. మానవతావాది రతన్ టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని కేసీఆర్ అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.