calender_icon.png 22 October, 2024 | 3:04 PM

పాక్‌లో కశ్మీర్ ఎప్పటికీ కలువదు

22-10-2024 02:55:20 AM

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా

జమ్ము, అక్టోబర్21: కశ్మీర్ ఎన్నటికీ పాకిస్థాన్‌లో కలవబోదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. భారత్‌లో తీవ్రవాద దాడులను ఆపకపోతే  తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఆదివారం రాత్రి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఓ డాక్టర్‌తో సహా ఆరుగురు బీహార్ వలస కూలీ లను హత్య చేసిన ఘటనపై అబ్దుల్లా తీవ్రం గా స్పందించారు.

భారత్‌లోకి ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని ఇప్పటికైనా ఆపేయాలని పాక్‌ను హెచ్చరించారు. భారత్‌తో సంబంధాలు కావాలని పాక్ కోరుకుంటే ఇలాంటి ఉగ్రవాద చర్యలకు వాళ్లు చరమగీతం పాడాలని సూచించారు. పాక్‌లాగా కశ్మీర్ ఎప్ప టికీ మారదని స్పష్టం చేశారు.

పేద వలస కార్మికులపై దాడులు చేస్తే తీవ్రవాదులకు ఏం వస్తుందని ప్రశ్నించారు. ఇక్కడ మరో పాక్‌ను సృష్టించాలనుకుంటే తాము ఎట్టి పరిస్థితిల్లోనూ దానిని జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. 75 ఏండ్లలో తీవ్రవాదం లేని పాక్‌ను నిర్మించలేకపోయారని, అలాంటింది ఇప్పుడెలా సాధ్యమవుతుందని నిలదీశారు.