calender_icon.png 2 October, 2024 | 8:03 AM

కార్వీ స్టాక్ బ్రోకింగ్, సీఎండీ ఖాతాల అటాచ్‌మెంట్

13-09-2024 12:39:11 AM

సెబీ ఉత్తర్వులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్‌తో పాటు ఆ సంస్థ సీఎండీ పార్థసారథిల బ్యాంక్ ఖాతాలు, డీమ్యాట్ ఖాతాలను అటాచ్ చేస్తూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రూ.25 కోట్ల బకాయిల రికవరీ కోసం సెబీ ఈ చర్య చేపట్టింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లెయింట్ల నిధుల్ని దుర్వినియోగం చేశారన్న కేసుకు సంబంధించి బకాయిల్ని 15 రోజుల్లోగా చెల్లించాలంటూ ఆగస్టు 7న రెగ్యులేటర్ కార్వీకి, పార్థసారథికి నోటీసులు పంపింది.

ఈ కేసులో 2023 ఏప్రిల్‌లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌ను, పార్థసారథిని ఏడేండ్ల పాటు సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధించడంతో పాటు రూ. 21 కోట్ల జరిమానాను విధించింది. బ్రోకింగ్ సంస్థకు రూ. 13 కోట్లు, ఆ కంపెనీ సీఎండీకి రూ.8 కోట్ల చొప్పున ఫైన్ వేసింది. ఆ జరిమానాకు వడ్డీ, రికవరీ వ్యయాలు కలిపి రూ. 15.34 కోట్లు, రూ. 9.44 కోట్ల చొప్పున కట్టాలంటూ ఈ ఏడాది ఆగస్టులో నోటీసులు జారీచేసింది.