calender_icon.png 23 October, 2024 | 11:54 AM

కరీంనగర్ టు సిరివంచ

15-07-2024 01:52:30 AM

  1. గుట్టుచప్పుడు కాకుండా పీడీఎస్ బియ్యం తరలింపు

రేషన్ దుకాణం వద్దే లబ్ధిదారులతో బేరమాడుతున్న దళారులు

కొందరు వీధుల్లోకి వచ్చి కిలోకు రూ.8 చొప్పున కొంటున్న వైనం

కరీంనగర్, జూలై 14 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో సీఎంఆర్ ధాన్యం అక్ర మ దందా వెలుగు చూడగా, తాజాగా పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్(పీడీఎస్) బియ్యం దందా కూడా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల నుంచి మహారాష్ట్ర బార్డర్ కేంద్రంగా ఉన్న సిరివంచకు భారీగా రేషన్ బియ్యం తరలిపోతున్నది. రెండు జిల్లా అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తుండటంతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

ఈ అక్రమ దందా చేస్తున్న వారిలో రైస్‌మిల్లర్లు సైతం ఉన్నట్లు వార్తలు వినవస్తునాయి. రైస్‌మిల్లర్లు జిల్లాలో ఒకరిద్దరు దళారులను నియమించుకుని దందా సాగిస్తుస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర సరిహద్దులోని సిరివంచ నుంచి, ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బియ్యం తరలి వెళుతున్నదని తెలిసింది. బియ్యం దందా ప్రధానంగా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వేళ్లూనుకున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.

వీధుల్లోకి వచ్చి కొనుగోళ్లు..

పీడీఎస్ దందా కొనసాగిస్తున్న కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని సేకరించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్ వంటి పట్టణాల్లో సైకిల్‌పై వస్తున్నారు. కొందరు ధైర్యంగా నడుచుకుంటూ వస్తున్నారు. ‘రేషన్ బియ్యం కొంటాం, రేషన్ బియ్యం కొం టాం’ అంటూ నిర్భయంగా లబ్ధిదారుల నుంచి బియ్యం కొంటున్నారు. కిలోకు రూ. 8 నుంచి రూ.10 చొప్పున ఇస్తున్నారు. తిరి గి పెద్ద వ్యాపారులకు ఎక్కువ ధరకు బియ్యం అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా కాకుండా కొందరైతే ఏకంగా రేషన్ దుకాణాల వద్దే బియ్యం కొంటున్నా రు. బియ్యం సేకరించేందుకు ఏకంగా దళారులు రెడీగా ఉంటున్నారు.

ఇలా ప్రతీ నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగుతోంది. ఒక్కో దళారీ సుమారు 2 నుంచి 3 క్వింటాళ్లకు పైగా సేకరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచే అక్రమార్కులు 3 నుంచి 4 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇదొక ఎత్తయితే డీలర్ల  నుంచే అక్రమార్కులు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. బయోమెట్రిక్ విధానం అమలులో ఉన్నా దందా సాగుతుండటం గమనార్హం.

ఐతరాజ్‌పల్లిలో 22 క్వింటాళ్లు..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండ లం ఐతరాజ్‌పల్లిలో ఇటీవల  పౌరసరఫరాల శాఖ అధికారులు అక్రమంగా నిల్వ చేసిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యా న్ని పట్టుకన్నారు. అక్రమార్కులు ఆటో లో తరలిస్తుండగా అడ్డుకున్నారు. యార్ల మల్లయ్యపై ప్రజా పంపిణీ వ్యవ స్థ నియంత్రణ చట్టం ప్రకారం కేసు నమోదు చేయించారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అధికారులు తరచూ పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుంటూనే ఉన్నారు.