18-04-2025 11:55:22 PM
న్యూఢిల్లీ: రాష్ట్రప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఖండించిన విషయం తెలిసిందే. ఆయన సుప్రీం కోర్టు సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ధన్ఖడ్ తీరును తప్పుబట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కార్యనిర్వాహక వర్గం సరిగ్గా విధులు నిర్వర్తించకపోతే కల్పించుకునే హక్కు న్యాయవ్యవస్థకు ఉంది.
రాష్ట్రపతి కేవలం నామమాత్రపు అధిపతి. కార్యనిర్వాహక వర్గం తప్పకుండా వారి విధిని నిర్వర్తించాలి. ఈ దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రత అనేది రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు. రాజ్యసభ చైర్మన్ ఇలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎన్నడూ చూడలేదు. నేను ధన్ఖడ్ స్టేట్మెంట్ చూసి ఆశ్చర్యపోయా. ప్రస్తుతం దేశంలో ఏ వ్యవస్థ మీదైనా ఎక్కువ నమ్మకం ఉందంటే అది న్యాయవ్యవస్థే. అధ్యక్షుడికి వ్యక్తిగత అధికారాలు ఏమీ లేవు.’ అని పేర్కొన్నారు.