- వ్యభిచారం చేయాలంటూ కన్న కూతురిపై తల్లి ఒత్తిడి
- మనస్థాపంతో పోలీసులను ఆశ్రయించిన బాలిక
- తల్లిపై కేసు నమోదు చేసి, బాలికను సఖీ సెంటర్కు తరలించిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : నేటి సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. పేగు బంధానికి విలువ లేకుండా పోతుంది. తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే వారిని కాటు వేస్తున్నారు. కొందరు తల్లులు విలాసాలకు అలవాటు పడి డబ్బు సంపాదన కోసం తమ పిల్లలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వెంకటాపురం ప్రాంతానికి చెందిన నగీన అనే మహిళ తన భర్తతో విడాకులు తీసుకుని, కుమార్తె(14)తో కలిసి వేరుగా నివసిస్తున్నది. చెడు వ్యసనాలకు బానిసైన నగీన తన మాదిరిగానే తన కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించాలనే ప్రయత్నం చేసింది.
ఆ బాలిక ఎదురు తిరగడంతో తీవ్ర వేధింపులకు గురిచేసింది. వ్యభిచారం చేయడం ఇష్టంలేని ఆ బాలిక, తన తల్లి వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్థాపం చెంది బుధవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి అల్వాల్ పోలీసులను ఆశ్రయించింది. ఆ బాలిక చెప్పిన మాటలకు చలించిపోయిన పోలీసులు ఆమె తల్లిపై కేసు నమోదు చేశారు.
ఆ బాలికను సఖీ కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న నగీన గురువారం అల్వాల్ పోలీస్స్టేషన్కు చేరుకుని తన కూతురును సఖీ కేంద్రానికి ఎలా తరలించారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది.
తన కూతురును వెంటనే తనకు అప్పగించాలని పోలీస్స్టేషన్లోనే బిగ్గరగా కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న అల్వాల్ పోలీసులు కౌన్సిలింగ్ నిమిత్తం ఆమెను కూడా సఖీ కేంద్రానికి తరలించారు.