calender_icon.png 25 October, 2024 | 5:00 AM

'కంగువ' ఫైటర్ కాదు.. వారియర్

25-10-2024 02:36:26 AM

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కంగువ'. ఈ సినిమాను భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో చిత్రబృందం గురువారం హైదరాబాద్ లో మీడియాతో సమావేశమైంది. ఈ ప్రెస్ మీట్లో హీరో సూర్య మాట్లాడుతూ.. "కంగువ'ను రిలీజ్ చేస్తున్న మైత్రీ వారికి, మాతో అసోసియేట్ అయిన యూవీ సంస్థకు థ్యాంక్స్. నా రక్తం మీ రక్తం వేరు కాదు. మనమంతా ఒక్కటే. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. నా సినిమా థియేటర్లలో విడుదలై రెండేళ్లు దాటింది.

అయినా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమా రీ రిలీజ్ అయినప్పుడు మీ నుంచి వచ్చిన స్పందనకు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా మీకు గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలనే 'కంగువ' లాంటి గొప్ప చిత్రం చేశాను. రెండున్నరేళ్ల టైమ్ తీసుకుని మీరు ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని అరుదైన సినిమాని చేశాం. దర్శకుడు శివ వల్లే ఇది సాధ్యమైంది.

ఆయన ఎంతో ప్యాషన్ తో 'కంగువ'ను తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ ను ప్రతిరోజూ ఎంజాయ్ చేశాను. నా ఫ్రెండ్ రాక్ స్టార్ దేవికి, సినిమాటోగ్రాఫర్ వెట్రి గారికి థ్యాంక్స్. 'కంగువ' లాంటి సినిమాలు చేసేందుకు దర్శకుడు రాజమౌళి గారు స్ఫూర్తినిచ్చారు. ఆయన తన చిత్రాలతో మాకు దారి చూపించారు. కంగువ పూర్తి తెలుగు సినిమా.. ఇండియన్ సినిమా. ఇది ఒక పైటర్ సినిమా కాదు..

తన వాళ్ల కోసం, తను నమ్మిన ధర్మం కోసం పోరాడే వారియర్ మూవీ. నా లైఫ్ లో మీరు నా వారియర్స్. నా అభిమానులైన మీరు మీ జీవితాల్లో ఒక వారియర్ లా పోరాడి అనుకున్నది సాధించాలి, గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. బాలకృష్ణ గారి అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. ఆయన సమయపాలన, హార్డ్ వర్క్, ప్యాషన్ చూశాక.. అందుకే అంత గొప్ప స్థాయికి వెళ్లారనిపించింది.

27 ఏళ్ల నట ప్రయాణంలో నన్నెంతో ఆదరించారు. నటుడిగా కమల్ హాసన్ గారిని చూసి స్ఫూర్తి పొందుతుంటా. మంచి సినిమాలు సమాజంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. నా 'కాక కాక' సినిమా చూసి ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. 'జైభీమ్' తర్వాత తమిళనాడులో 3 లక్షల మందికి ఇంటి పట్టాలు వచ్చాయి. కంగువ కోసం ప్రతి రోజూ 3 వేల మంది పనిచేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడటం వల్లే ఇంత గొప్ప సినిమా తయారైంది" అన్నారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ.. "ఒక పీరియాడిక్ మూవీ చేయాలనే ఆలోచనతో 'కంగువ' కథ రాయడం ప్రారంభించా. వెయ్యేళ్ల కిందట ఆదిమానవుల టైమ్ నుంచి ఐదు తెగల మధ్య జరిగే పోరాటాన్ని నేపథ్యంగా ఎంచుకుని స్క్రిప్ట్ తయారుచేశాం. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారి ప్రోత్సాహం వల్లే ఎంతో ప్రిపరేషన్, ప్యాషన్ తో ఈ మూవీ చేయగలిగాం.

కథ చెప్పినప్పుడు ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు శివ అని సూర్య గారు చెప్పడం నాకు ఎంతో నమ్మకాన్నిచ్చింది. మన సౌతిండియన్ సినిమాలను  ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలో రాజమౌళి గారు చూపించారు. నాకు ఆయన ఎంతో స్ఫూర్తినిస్తారు. రాజమౌళి గారి 'విక్రమార్కుడు' సినిమాను తమిళంలో 'సిరుతై'గా రీమేక్ చేశాను. ఆ సినిమాతో నా ఇంటి పేరు ముందు సిరుతై వచ్చింది.

అలా నేను రాజమౌళి గారికి రుణపడి ఉంటాను. సీజీ వర్క్, ఎమోషన్ ఎలా బాగా హ్యాండిల్ చేయాలో ఆయన చేసి చూపించారు. అందరికీ 'కంగువ' తప్పకుండా నచ్చుతుంది. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ దక్కుతుందని ఆశిస్తున్నా" అన్నారు. ఇంకా ఈ సమావేశంలో ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా, రచయిత రాకేందు మౌళి, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నుంచి శశి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.