20 రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహం
విదేశానికి వెళ్లిన మూడు రోజులకే మృతి
కామారెడ్డి, జూలై28 (విజయక్రాంతి): కుటుంబాన్ని సాకేందుకు సౌదీ వెళ్లిన ఓ యువకుడిని మూడు రోజులకే మృత్యువు కబలించింది. వివరాలు.. కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం ఆర్గోండకు చెందిన కొర్పోల్ శ్యామయ్య(38) ఈ నెల 5న సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన అనంతరం పరిస్థితులు బాగా లేకపోవడంతో అనారోగ్యానికి గురయ్యాడు. వెళ్లిన రెండు రోజులకే అక్కడి వారు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈనెల 8న శ్యామయ్య ఆసుపత్రిలో మృతిచెందాడు. సౌదీ రియాద్లో ఉన్న గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ సభ్యుడైన మహమ్మద్ ఫరూక్.. శ్యామయ్య మృతదేహాన్ని బాధ్యత తీసుకుని ఇండియాకు పంపించారు. ఆదివారం హైదారాబాద్ విమానశ్రయానికి చేరుకోగా.. గ్రామస్తులు వెంకట్రెడ్డి, ప్రణీత్రెడ్డి, రవి, సల్మాన్, ఎన్ఆర్ఐ శాఖ అధికారి చిట్టిబాబు సహాయంతో స్వగ్రామానికి తరలించారు. ఆర్గోండలో విచాదఛాయలు అలుముకున్నాయి.