calender_icon.png 11 February, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలియుగ్ రాఘవ్!

11-02-2025 01:26:57 AM

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు

రంగరాజన్‌పై దాడి ఘటనలో ఆరుగురు అరెస్ట్

  1. ప్రధాన నిందితుడు రామరాజ్యం స్థాపకుడు వీరరాఘవరెడ్డి 
  2. ఆర్థిక సాయం చేయాలని, ఆలయ బాధ్యతలు 
  3. ఇవ్వాలని దాడి 
  4. నిందితుల్లో 22 మంది గుర్తింపు 
  5. వివరాలు వెల్లడించిన రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్
  6. అర్చకుడు రంగరాజన్‌కు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పరామర్శ 
  7. ఇలాంటి దాడులను సహించేది లేదన్న సీఎం రేవంత్‌రెడ్డి 
  8. ఏపీ డిప్యూటీ సీఎం పవన్, తెలంగాణ మంత్రులు, 
  9. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పరామర్శ 
  10. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన దాడి ఘటన

హైదరాబాద్/రంగారెడ్డి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచి న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చ కుడు రంగరాజన్‌పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కొప్పవరానికి  చెందిన వీరరాఘవరెడ్డి తాను స్థాపించిన రామరాజ్యం సంస్థలో సభ్యులను చేర్పించాలని, తమకు ఆర్థిక సాయం చేయాలని రంగ రాజన్‌ను డిమాండ్ చేయగా, దానికి ఆయన నిరాకరించారు. దీంతో వీరరాఘవరెడ్డి తదితరులు రంగరాజన్‌పై దాడి చేశారు.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకొన్నా మని, అరెస్ట్ అయిన వారిలో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారిని గుర్తించా మన్నారు.

తాము స్థాపించిన రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించడంతో పాటు తమకు ఆర్థిక సాయం అందించాలని పలుమార్లు వీరరాఘవరెడ్డి రంగరాజ న్‌ను సంప్రదించగా ఆయన నిరాకరించడంతో దాడికి పాల్పడినట్లు డీసీపీ పేర్కొన్నారు. దాడి ఘటనలో పోలీసులు మొత్తం 22 మందిని గుర్తించారు.

17 మంది నిందితుల ఆచూకీ తెలిసినట్లు అందులో తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన 17 మంది ఉన్నారని చెప్పారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

రామరాజ్యంలో చేరినవారికి 20వేల జీతం..

ఏపీకి చెందిన వీరరాఘవరెడ్డి 2022లో రామరాజ్యం స్థాపించారు. తాను స్థాపించిన రామరాజ్యం సంస్థను బలోపేతం చేసేందుకు  సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. రామరాజ్యంలో చేరిన వారికి కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టారు. ఇందులో చేరిన వారికి నెలవారీగా రూ.20వేల జీతం ఇస్తానని సభ్యులకు వివరించి వారికి నియమనిబంధనల గురించి వివరించారు.

ఇటీవల తణుకు, కోటప్పకొండలో వీరరాఘవరెడ్డి  పర్యటించి రామ రాజ్యం విధివిధానాల గురించి సభ్యులకు హితబోధ చేశారు. ప్రత్యేకంగా రామరాజ్యంలో చేరిన వారికి డ్రెస్‌కోడ్ ఉండాలని ఈ నెల 6వ తేదీన యాప్రాల్ రామరాజ్యం సభ్యులంతా సమావేశమయ్యారు. రామరాజ్యం సభ్యులంతా బ్యానర్‌ను పెట్టుకొని ఫొటోలు, వీడియోలు దిగి సామాజిక మా ధ్యమాల్లో ప్రచారం చేసుకున్నారు.

ఈ నెల 7వ తేదీన రామరాజ్యం సభ్యులంతా వీరరాఘవరెడ్డి నాయకత్వంలో 25 మంది  బృం దం ప్రత్యేకంగా నల్లదుస్తులు ధరించి  చిలుకూరు ఆలయ సమీపంలో అర్చకుడు రంగరాజన్ నివాసానికి చేరుకొని ఆయనపై దాడికి పాల్పడ్డారు. గత కొంత కాలంగా వీరరాఘవరెడ్డి మణికొండలో నివాసం ఉంటున్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

ఉగాది వరకు డెడ్‌లైన్..

శుక్రవారం ఉదయం రంగరాజన్ ఇంటికి వెళ్లిన వీరరాఘవరెడ్డి తదితరులు ఆలయ బాధ్యతలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి రంగరాజన్ నిరాకరించడంతో దాడికి దిగారు. దాడిని అడ్డుకో బోయిన రంగరాజన్ కుమారుడిని సైతం కొట్టారు. తాము ఇక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నవారిని, శాస్త్రం నేర్చేవారిని ఎందుకు గుర్తించడం లేద ని రంగరాజన్‌ను ప్రశ్నించారు.

ఊరికే కోర్టు లో కేసులు వేస్తే ఏం లాభమని, తాము చెప్పినట్టు వినాలన్నారు. ఉగాది వరకు టైం ఇస్తున్నామని, రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే తాము రామని, వచ్చేవారు వచ్చి పనిచేసుకుని వెళ్తారని హెచ్చరించారు. 

2040 నాటికి రామరాజ్యం..

2040 నాటికి రామరాజ్యం ఏర్పాటు చేస్తానని వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ పేరి ట ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేశాడు. అదే పేరుతో వెబ్‌సైట్ సైతం ప్రారంభించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు తిరుగుతూ రామరాజ్య స్థాపనపై ప్రచారం చేస్తున్నాడు. తనకు 5వేల మంది సైన్యం కావాలని ప్రకటన జారీ చేశాడు.

భగవద్గీత వచ్చి ఉండాలని, ఐదు కిలోమీటర్లు నడవడం, రెండు కిలోమీటర్లు పరుగెత్తడం చేయ గలగాలని నియమాలు పెట్టాడు. అంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. జైహిం ద్, జై విశ్వమానవ వేదిక పేరుతో 2016లో ఓ గ్రూపును సైతం ఏర్పాటు చేశాడు.

తర్వాత దాన్ని మూసివేసి గోరక్షణ పేరుతో కార్యక్రమాలు ప్రారంభించాడు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకునేం దుకు సైన్యాన్ని వాడుకున్నాడు. 2015లో అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో వీరరాఘవరెడ్డిపై ఓ కేసు కూడా నమోదైంది.

కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శ..

రంగరాజన్‌పై దాడి ఘటనలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. బాధితుడు రంగరాజన్‌కు ఆయన ఫోన్ చేసి దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వపరంగా తాము అండగా ఉం టామని.. అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పారు. రంగరాజన్ ను పరామ ర్శించిన విషయాన్ని బండి సంజయ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకొన్నారు.

రౌడీయిజాన్ని ఉపేక్షించేది లేదు.. 

అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. రామరాజ్యం పేరు తో రౌడీయిజం చేస్తున్నవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రామరాజ్యం పేరుతో దాడులు చేసే వారిని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. రాముడి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను సహించేది లేదని చెప్పారు. 

 ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం..

రంగరాజన్ తండ్రి సౌందరరాజన్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

 మంత్రి కొండా సురేఖ 

ధర్మపరిరక్షణపై దాడి..

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  ‘ఎక్స్’ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదొక దురదృష్టకరమైన ఘటన అని, దీన్ని వ్యక్తిపై కాకుండా, ధర్మపరిరక్షణపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కొన్ని దశాబ్దాలుగా ధర్మపరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు రంగరాజన్ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి.. ఆ మూకను నడిపిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. 

 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  

రంగరాజన్‌కు కేటీఆర్ పరామర్శ.. 

అర్చకుడు రంగరాజన్‌పై రామరాజ్యం సంస్థ ప్రతినిధులు దాడికి పాల్పడిన విషయంపై కేటీఆర్ స్పందించారు. దాడి హేయ మైన చర్య అని ఖండించారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి చిలుకూరులో రంగరాజన్‌తోపాటు కుటుంబ సభ్యు లను పరా మర్శించారు. రంగరాజన్‌పై దాడి ఘటన తనను తీవ్రంగా బాధించిందని ఇది ప్రభు త్వం వైఫల్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని,  దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

సమగ్ర దర్యాప్తు జరిపించాలి

చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రం గరాజన్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. రంగరాజన్ గతంలో ఓ దళితుడిని ఆధ్యాత్మిక గురువుగా తీర్చిదిద్ది అదే దేవాలయంలో అర్చకుడిగా నియమించారన్నారు. కుల అసమానతలు ఉండ కూడదని ఆయన ఆకాంక్షించడాన్ని ఓర్వలేని మతోన్మాదులు దాడికి తెగబడ్డారన్నారు. దా డికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు. 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

రంగరాజన్‌పై దాడి హేయం..

హిందూ ధర్మం కాపాడేవారే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేయడం హేయమైన చర్య అని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడుతూ దేవాలయ సేవలో ఉన్న వ్యక్తిని హింసించడాన్ని సహించకూడదన్నారు. రామరాజ్యం పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం హింసను ప్రేరేపించే వ్యక్తులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు. 

 బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ 

ఇలాంటి దాడులను సహించేది లేదు..

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై రామరాజ్యం అనే సంస్థ ముసుగులో చేసిన దాడిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఇలాం టి దాడులను సహించేది లేదని చెప్పారు. సోమవారం రంగరాజన్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం.. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అలాగే దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రంగరాజన్‌పై దాడిని ఖండిస్తున్నా.. 

ప్రజాస్వామ్యంలో దౌర్జన్య చర్యలకు, బెదిరింపులు, భౌతిక దాడులకు ఏమాత్రం స్థానం లేదు. అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాదు.. సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలి. దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలి. రంగరాజన్‌కు బీజేపీ అండగా నిలబడుతుంది.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి