19-04-2025 08:45:10 PM
తాగుబోతుగా పోలీసులు చిత్రీకరించడం ఘోరం
బీజేపీ ఎంపీలు నన్ను ప్రధాని కావాలంటున్నారు..
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్
సంగారెడ్డి,(విజయక్రాంతి): పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ది ప్రమాదం కాదని, హత్యేనని, తనకు ఆసుపత్రి నర్సులు చెప్పారన్నారు. ప్రవీణ్ను తాగుబోతుగా చిత్రీకరించడం ఘోరమన్నారు. పోలీసులపై ఒత్తిడి ఉన్నందునే యాక్సిడెంట్గా చెప్పారని పాల్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మైత్రీ మైదానంలో క్రిస్టియన్ కమ్యూనిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
అంతకుముందు రామచంద్రాపురం పట్టణంలోని సండే మార్కెట్ నుంచి పటాన్చెరు మైత్రీ గ్రౌండ్ వరకు చేపట్టిన రన్ ఫర్ జీసస్ శాంతి పాదయాత్రలో కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో యుద్దాలను ఆపే శాంతిదూతగా పనిచేశానన్నారు. వచ్చే ఎన్నికల నాటికి సీఎం రేవంత్రెడ్డి సైతం నాకే ఓటు వేస్తారని, అవసరమైతే కలిసి పనిచేస్తామన్నారు. అన్ని కులాలను, మతాలను గౌరవించడం నేర్చుకోవాలని చెప్పారు. రాముడు కరోనా ప్రియుడని కత్తి మహేశ్ దూషించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ పగడాలను తాగుబోతుగా చిత్రీకరించడం ఘోరమన్నారు.
ప్రవీన్ది ముమ్మాటికీ హత్యేనని, పోలీసులు తప్పుడు రిపోర్టులు అందించి యాక్సిడెంట్గా చెప్పడం సరికాదన్నారు. చాలా దేశాల ప్రధానులు నన్ను ప్రధానిగా కోరుకుంటున్నారని చెప్పారు. హిందువులు, ముస్లీంలకు వేల కోట్ల రూపాయలు పింఛన్లు అందించామన్నారు. 18 పార్టీల సహకారం తనకు ఉందన్నారు. 38 మంది బీజేపీ ఎంపీలు తనను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రపంచ దేవాలలోని డిక్టేటర్లు కూడా నా అనుచరులేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్రెడ్డి, రన్ ఫర్ జీసస్ కార్యక్రమ ప్రతినిధులు, వివిధ చర్చిల ఫాదర్లు, క్రిస్టియన్లు పాల్గొన్నారు.