calender_icon.png 21 October, 2024 | 3:53 AM

జీవో29ను ఉపసంహరించుకోవాలి

21-10-2024 01:40:59 AM

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): పంతాలకు, పట్టింపులకు పోకుండా తక్షణమే జీవో29ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పరీక్షకు ఒక్క రోజు ముందు కూడా అభ్యర్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారంటే పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అర్ధం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.

నిరుద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదనను అర్థం చేసుకోవాలంటూ ఆదివారం సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. గ్రూప్  పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. 29 జీవో వల్ల 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హులయ్యారని అన్నారు. 563 పోస్టులకు గుండుగుత్తగా 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయమని పేర్కొన్నారు.

మొత్తం పోస్టుల్లో 354 రిజర్వ్ పోస్టులున్నాయని తెలిపారు. 29 జీవోవల్ల ఓపెన్ కేటగిరిలో అర్హత సాధించిన రిజర్వ్ అభ్యర్థులను సైతం రిజర్వ్ కేటగిరీలో చేర్చడం తీవ్ర అన్యాయమని తెలిపారు. ఈ జీవోవల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే.. ఓసీ వర్గాలు 1:65 శాతం మేర అర్హత సాధించారని తెలిపారు.

జీవో నెంబర్ 29 రాజ్యాంగ స్ఫూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు వ్యతిరేకమని అన్నారు. అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, పరీక్షలను రీషెడ్యూల్ చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారని తెలిపారు. 29 జీవో వల్ల రాష్ర్టంలో మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయబోతున్నారనే చర్చ మొదలైందని అన్నారు.