హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేపటి నుంచి మళ్లీ జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగనుంది. రేపటి నుంచి శనివారం వరకు ఇంజినీర్లను కమిషన్ విచారించనుంది. కమిషన్ సుమారు 40 మందికిపైగా ఇంజినీర్లకు నోటీసులిచ్చి విచారణకు పిలవనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లను, బ్యారేజీల నిర్మాణం సమయంలో ఉన్న ఈఎన్సీలను కమిషన్ ప్రశ్నించనుంది. ఇంజినీర్ల తర్వాత ఉన్నతాధికారులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించనుంది.
అన్ని దస్త్రాలు ఇవ్వాలని నీటి పారుదల శాఖను కమిషన్ ఆదేశించింది. ప్లేస్ మెంట్ రిజిస్టర్, ఎంబుక్ లు తీసుకురావాలిని కమిషన్ సూచించింది. తప్పు చేసిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేసే యోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టాలని, తప్పు చేసిన ఇంజినీర్లకు పదోన్నతులు ఇవ్వొద్దని సిఫార్సు చేసే అవకాశముంది. తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ విభాగానికి పీసీ ఘోష్ కమిషన్ ఆదేశాలిచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ కాగ్ రిపోర్టుపై కూడా అధికారులను విచారణకు పిలవనున్నట్లు సమాచారం.