- సెప్టెంబర్ 10న నిర్ణయం వెల్లడించనున్న సుప్రీం
- అప్పటివరకు జైలులోనే ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఇంకా ఊరట లభించలేదు. సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు పూర్తి కాగా తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. సెప్టెంబర్ 10న తీర్పును వెలువరిస్తామని తెలిపింది. ఫలితంగా మరికొన్ని రోజులు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు. వాదనల సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ సీబీఐ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో రెండేళ్ల వరకూ ఢిల్లీ సీఎంను అరెస్టు చేయలేదని, ఈడీ కేసులో బెయిల్ రాగానే సీబీఐ అరెస్టు చేసిందని తెలిపారు. అరెస్టు ముందు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో సీబీఐ తీరుపై ధర్మాసనం కూడా అసహనం వ్యక్తం చేసింది.