గజ్వేల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను సీఎంఓ కార్యాలయ జాయింట్ సెక్రెటరీ సంగీత శనివారం పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో జరుగుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను సీఎంఓ జాయింట్ సెక్రెటరీ సంగీత పరిశీలించగా, ఆమెకు సర్వే వివరాలను కలెక్టర్ మను చౌదరి, ఆర్డీవో బన్సీలాల్ వివరించారు. డిజిటల్ కార్డు సర్వేలో తలెత్తుతున్న సమస్యలు, సర్వే విధానాన్ని సీఎంవో కార్యదర్శి సంగీత క్షుణ్ణంగా పరిశీలించి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నెంబర్ లేని, రేషన్ కార్డు లేనివారి వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారు అని అడగగా, రేషన్ కార్డుల వారీగా నమోదు చేయడంతో పాటు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ప్రత్యేకంగా నమోదు చేస్తున్నట్లు, ఇంటి నెంబర్ లేని వారి వివరాలను పాత రేషన్ కార్డు ఆధారంగా నమోదు చేస్తున్నట్లు కలెక్టర్, ఆర్డీవోలు సీఎంవో కార్యదర్శి సంగీతకు తెలిపారు.
అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... పైలట్ ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అలాగే కుకునూరు పల్లి గ్రామంలో కూడా డిజిటల్ సర్వే నిర్వహించి పూర్తి చేశామని తెలిపారు. గజ్వేల్ లో 17 వార్డులో 80% సర్వే పూర్తయిందని సాయంత్రానికి సర్వే మొత్తం పూర్తవుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రావణ్, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, అర్ ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.